Cyber Crime: అమాయక ప్రజలను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఢిల్లీ నివాసి గురుదీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్ (42) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్టోబర్ 16, 2025న హైదరాబాద్కు చెందిన ఒక 62 ఏళ్ల వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. బాధితుడి ఆధార్ కార్డు అక్రమ కార్యకలాపాలకు వాడబడిందని, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. భయపడిపోయిన బాధితుడిని వీడియో కాల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ.. అరెస్ట్ నుండి తప్పించుకోవాలంటే నగదు డిపాజిట్ చేయాలని నమ్మించి.. విడతల వారీగా సుమారు రూ. 1కోటి ఏడు లక్షలు కాజేశారు.
నిందితుడు గురుదీప్ సింగ్ ఢిల్లీలో ట్రావెల్ , మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఇతడు తన సహచరులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి.. అమాయకుల పేరుతో కరెంట్ బ్యాంక్ ఖాతాలను సేకరిస్తుంటాడు. బాధితుల నుండి వచ్చే డబ్బును ఈ ఖాతాల్లోకి మళ్లించి.. ఆపై ప్రధాన నిందితులకు అందజేస్తుంటాడు. ఈ కేసులో ఇప్పటికే దీపక్ గెహ్లావత్ , ప్రశాంత్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక పెద్ద మోసం. ఏ ప్రభుత్వ సంస్థ లేదా పోలీస్ విభాగం వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేయదు లేదా విచారించదు. కేసుల నుండి విముక్తి కల్పిస్తామని ఏ అధికారి ఫోన్ ద్వారా డబ్బు అడగరని.. గుర్తుతెలియని వ్యక్తులు సీబీఐ, కస్టమ్స్, క్రైమ్ బ్రాంచ్ అధికారులమని ఫోన్ చేస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండని పేర్కొన్నారు. ముఖ్యంగా మీ బ్యాంక్ ఖాతా వివరాలు లేదా OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.
సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్.జి. శివ మారుతి పర్యవేక్షణలో.. ఇన్స్పెక్టర్ కె. ప్రసాదరావు , బృందం చాకచక్యంగా వ్యవహరించి ఈ నిందితుడిని పట్టుకున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
Also Read: ఏసీబీ పంజా.. రూ. 15లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్ఈ!