Delhi Politics: దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ప్రధానమంత్రి పదవికి ఎవరు సరైన వ్యక్తి? రాష్ట్రాల్లో రాజకీయ గాలి ఏ వైపు వీస్తోంది? వంటి ప్రశ్నలకు ఇండియా టుడే-సి-వోటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో ఆయా ప్రశ్నలకు సమాధానాలు వచ్చేశాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచిపోయింది. సీజేపీ ఉద్యమాలు, కేంద్రమంత్రి రాజీనామా, యువత ఆందోళన నేపథ్యంలో మోదీ సర్కార్లో భారీ కుదుపు మొదలైంది. ఈ క్రమంలో చకచకా పావులు కదుపుతోంది మోదీ సర్కార్. ప్రస్తుతం లోక్సభకు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని తేలింది. గత సర్వేతో పోలిస్తే ఎన్డీయే బలం స్వల్పంగా తగ్గింది. ఇండియా కూటమి కాస్త పుంజుకున్నట్లు దీని ద్వారా తేలింది.
ఇప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి 45 శాతం ఓటు షేరుతో 326 స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొంది. బీజేపీ సొంతంగా 261 సీట్లు, దాని మిత్రపక్షాలు 65 సీట్లు గెలుచుకుంటాయని తేలింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని వెల్లడికాగా, ఈసారి ఆ సంఖ్య తగ్గడం గమనార్హం. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 185 సీట్లు సాధిస్తుందని పేర్కొంది.
బీజేపీ-261 సీట్లు, కాంగ్రెస్-106 సీట్లు గెలుచుకుంటాయని అంచనా. ఇతర పార్టీలకు 176 సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది మూడు సీట్లు పెరిగాయి. 2024 ఎన్నికల్లో గెలుచుకున్న 234 స్థానాలతో పోలిస్తే 49 సీట్లు తక్కువ. ఇక ఓటు షేర్ విషయానికి వద్దాం. ఎన్డీఏ-45 శాతం, ఇండియా బ్లాక్-39 శాతం, ఇతరులు-16 శాతం సీట్లు గెలుచుకుంటారని వెల్లడైంది.
వివిధ వయస్సుల వారు.. కులాలు-మతాలు, పురుషులు-మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాష్ట్రాలు, లోక్సభ నియోజకవర్గాల వ్యాప్తంగా ఉన్న 25,184 మందిని అభిప్రాయాలను సేకరించింది. జూలై 1, 2026 నుండి ఆగస్టు 25, 2026 మధ్య వివరాలు సేకరించింది. రాష్ట్రాల పరంగా చూస్తే.. యూపీలో ఇండియా బ్లాక్ 40 శాతం ఓట్లు, ఎన్డీఏ 42 శాతం ఓట్లు గెలుచుకుంటుందని అంచనా. సీట్ల పరంగా చూస్తే, ఇండియా బ్లాక్- 41 సీట్లు, ఎన్డీఏ- 38 సీట్లు వస్తాయని తేలింది.
రాహుల్గాంధీ చేపట్టిన ఉద్యమాల వల్ల కాంగ్రెస్ సీట్ల సంఖ్య 80 నుంచి 106కు పెరిగింది. పరీక్షల పేపర్ లీకులు, పరిపాలనాపరమైన సమస్యల వల్ల బీజేపీ 287 నుంచి 261కి తగ్గినట్లు సర్వే పేర్కొంది. ప్రధానిగా ఎవరు కావాలన్నదానిపై 49 శాతం మంది నరేంద్రమోదీకి మద్దతు పలికారు. రాహుల్ గాంధీ-27 శాతం, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్-9 శాతం మద్దతు పలికారు. ప్రస్తుతం టీవీకే పార్టీకి పార్లమెంటులో ఒక్క ఎంపీ లేకపోవడం గమనార్హం.
ALSO READ: నేపాల్లో ప్రకృతి బీభత్సం.. ఢిల్లీ-ఖాఠ్మండు బస్సు సర్వీసుకు అంతరాయం