Delhi: ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల స్టూడెంట్- మోడల్ దారుణహత్యకు గురైంది. ఇంట్లోనే ఆమెని కత్తితో పొడిచి చంపేశాడు దుండగుడు. ఈ హత్య వెనుక జిమ్ ట్రైనర్ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది? దీని వెనుక అసలు కారణాలేంటి?
పశ్చిమ ఢిల్లీ తిలక్ నగర్ ప్రాంతంలోని న్యూ మహావీర్నగర్లో స్టూడెంట్ – మోడల్ ముస్కాన్ ఉంటోంది. ఆమె వయస్సు 21 ఏళ్లు. చదువు నిమిత్తం పేరెంట్స్కు దూరంగా ఉంటోంది. ఓ వైపు చదువుతూ, మరోవైపు మోడలింగ్ చేస్తోంది. అద్దెకు ఉన్న ఇంటి రెండో అంతస్తులో ఒంటరిగా ఉంది. బుధవారం మధ్యాహ్నం యువతి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి, ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి కేకలు విన్న ఇరుగుపొరుగువారు వెంటనే అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెని ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కత్తి పోట్ల వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేశారు. ముస్కాన్ వెళ్తున్న జిమ్లో ట్రైనర్గా పని చేస్తున్నాడు ఇమ్రాన్. అతడిపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం.. నిందితుడు-మృతుడికి కొంతకాలంగా పరిచయం ఉందని చెబుతున్నారు. దాడి తర్వాత నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు, ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇమ్రాన్ కొంతకాలంగా యువతిని వేధిస్తుండటంతో అతడ్ని దూరం పెట్టినట్లు యువతి ఫ్రెండ్స్ చెబుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అభిషేక్ గుప్తా వెల్లడించారు. ముస్కాన్ సోదరుడు కూడా ఇమ్రాన్పై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా దర్యాప్తు చేప్తున్నారు. డిజిటల్ ఆధారాల కోసం యువతి ఫోన్ నుంచి డేటా సేకరించే పనిలో పడ్డారు.
ALSO READ: కాన్పూర్లో కూలిన ట్రైనీ విమానం.. ఒక పైలట్ మృతి
హత్య జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మహిళ-అనుమానితుడు వేర్వేరు మతాలకు చెందినవారని, ఎలాంటి సమస్యలు లేకుండా ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నట్లు తెలిపారు. ముస్కాన్కు ముగ్గురు అక్కలు ఉండగా, ఈమె చిన్నది. ప్రస్తుతం చండీగఢ్లో ఉన్న ఆమె అక్క, ఈ ఘటన గురించి తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో ఈ విషయం వెల్లడైంది.