IMD Weather Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు–మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. IMDతాజా హెచ్చరికల ప్రకారం, దేశవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. రానున్న కొన్ని రోజుల పాటు ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 13 మధ్య కాలంలో పలు రాష్ట్రాల్లో వాతావరణం అత్యంత కీలకంగా మారనుంది.
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏప్రిల్ 11 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయల్లో ఏప్రిల్ 9 నుంచి 13 వరకు ఒక మాదిరి నుండి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా ఏప్రిల్ 9న ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
తూర్పు భారత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా రానున్న రోజుల్లో వాతావరణం అస్థిరంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని IMD కోరింది. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు. వర్షం పడేటప్పుడు ఎలక్ట్రిక్ స్తంభాలు లేదా చెట్ల కింద ఆశ్రయం పొందడం ప్రమాదకరం. మెరుపుల సమయంలో టీవీలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను జాగ్రత్తగా వాడాలి. ప్రయాణానికి ముందు వాతావరణ ముందస్తు హెచ్చరికలను గమనించి, అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.
Read Also: ప్రపంచాన్ని కాపాడామంటూ పాక్ డబ్బా.. మీమ్స్తో కుమ్మేస్తున్న భారత, ఇరాన్ యూజర్లు