దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏమాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా తగినంత మేర ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. చమురు ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. బంకుల వద్ద గుమిగూడి ఇంధనాన్ని అవసరానికి మించి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని సూచించారు. సరఫరా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు.
మరోవైపు గ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ పొందే సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు కచ్చితంగా ఆ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించింది. పీఎన్జీ కనెక్షన్లు అందుబాటులో ఉండి కూడా వాటిని వాడకుండా ఎల్పీజీ (LPG) సిలిండర్లపై ఆధారపడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అటువంటి వారికి ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
పీఎన్జీ నెట్వర్క్ పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలకు దీనిపై మూడు నెలల గడువు విధించింది. ఈ గడువు ముగిసేలోగా పైప్ గ్యాస్ కనెక్షన్కు మారాలని ఆదేశించింది. గడువు దాటిన తర్వాత కూడా ఎల్పీజీ సిలిండర్లు వాడితే గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తామని పేర్కొంది. పీఎన్జీ వాడకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. పైప్డ్ గ్యాస్ సురక్షితమైనదని చౌకైనదని వివరిస్తున్నారు. ప్రజలు ఈ మార్పునకు సహకరించాలని కోరుతున్నారు.
ఈ నిబంధన వల్ల పెద్ద నగరాల్లో ఎల్పీజీ వాడకం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన సిలిండర్లను పీఎన్జీ సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాలకు సులభంగా మళ్లించవచ్చని యోచిస్తోంది. ఇంధన కొరతపై పుకార్లు నమ్మవద్దని పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం కేవలం ఊహాగానమేనని తేల్చి చెప్పింది.