New flights to Riyadh from India: భారతదేశం పశ్చిమాసియా దేశాల మధ్య విమాన ప్రయాణాలను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రేపటి నుంచి పశ్చిమాసియాలోని మరిన్ని కీలక ప్రాంతాలకు విమాన సర్వీసులను అనుసంధానించనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్కు భారత్ నుండి విమాన రాకపోకలు పెంచేందుకు ప్రముఖ విమానయాన సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ నిర్ణయం వల్ల ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే వేలాది మంది భారతీయులకు గొప్ప ఊరట లభించనుంది.
ఎయిర్ ఇండియా సంస్థ రియాద్కు విమానాలను నడిపేందుకు ఇప్పటికే పూర్తిస్థాయి షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రేపటి నుంచి ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ ఇండియాతో పాటు ప్రముఖ బడ్జెట్ ఎయిర్లైన్ సంస్థ ఇండిగో కూడా ముంబయి-రియాద్-ముంబయి మార్గంలో కొత్త సేవలను ప్రారంభిస్తోంది. మెరుగైన కనెక్టివిటీ ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మరిన్ని ఆప్షన్లు కల్పించడమే ఈ విస్తరణ ముఖ్య ఉద్దేశమని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు స్పైస్జెట్ విమానయాన సంస్థకు కూడా ప్రత్యామ్నాయ విమానాశ్రయ అనుమతులు పొందేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో లేదా రద్దీ సమయాల్లో విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించేందుకు వీలు కలుగుతుంది. విమాన సర్వీసులు పెరగడం వల్ల టిక్కెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. డిమాండ్ను సాకుగా చూపి విమానయాన సంస్థలు అడ్డగోలుగా ధరలు పెంచకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమాన ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త సర్వీసుల ప్రారంభంతో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు అలాగే ఇక్కడి నుంచి పనుల నిమిత్తం వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు తప్పుతాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని విమానాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పశ్చిమాసియాతో విమాన అనుసంధానం పెరగడం వల్ల అటు వాణిజ్యం ఇటు పర్యాటక రంగాలు కూడా బలోపేతం కానున్నాయి.
Read Also: China Strategy: అమెరికా ఆధిపత్యానికి ఎండ్ కార్డ్? చైనా కొత్త యుద్ధ తంత్రం ఇదే!