China Strategy: ఎస్.. చైనా వేస్తున్న అడుగులు, రాబోయే ఐదేళ్లకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి తెలిస్తే.. అందరికీ ఇదే డౌట్ వస్తుంది. కానీ.. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. చైనా.. టార్గెట్ ఫిక్స్ చేసేసింది. రాబోయే ఐదేళ్లలో ఏమేం చేయాలి? ఎలా చేయాలి? అమెరికాని తెలివిగా ఎలా దెబ్బకొట్టాలి? అనే దానిపై క్లియర్ విజన్తో ఉంది. ఇది.. అమెరికా పోరాడని యుద్ధానికి సంబంధించిన వార్ ప్లాన్. ఎందుకంటే.. యూఎస్ తప్పుడు ప్రత్యర్థితో పోరాడటంలో బిజీగా ఉంది.
ఇరాన్ని దెబ్బతీసేందుకు, యుద్ధంలో విజయం సాధించేందుకు.. ట్రంప్ సర్కార్ వేల కోట్లు తగలేస్తోంది. మరోవైపు.. క్రూడ్ ఆయిల్ రేట్లు గ్లోబల్ హెడ్లైన్గా మారిన క్రమంలో.. చైనా సైలెంట్గా ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. మార్చి 5న.. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో.. చైనా 141 పేజీల 15వ పంచవర్ష ప్రణాళికని ఆవిష్కరించింది. అందులో.. భవిష్యత్ వ్యూహాలు, కొత్త టెక్నాలజీలని అందిపుచ్చుకోవడం, మెటీరియల్స్, ఇండస్ట్రీస్పై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రతిష్టాత్మక వ్యూహాన్ని నిర్దేశించుకుంది. నెక్ట్స్ జనరేషన్ ఆర్థిక వ్యవస్థని, సైనిక బలాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు.. ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంది. దీనిపై.. ఎవరూ దృష్టి పెట్టకపోవడమే ఇప్పుడు అసలు విషయం.
యుద్ధానికి సై అంటూ అన్ని దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికాకు.. చైనా తన పంచవర్ష ప్రణాళికతో దిమ్మతిరిగే షాకిచ్చింది. సైలెంట్ అస్త్రం సంధిస్తూ.. రక్షణ రంగంలో కీలకంగా మారిన ఎఫ్-35 ఫైటర్ జెట్కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే.. అగ్రరాజ్యాన్ని దెబ్బతీసే ఎత్తుగడ వేసింది. అమెరికా రక్షణ రంగంలో అత్యంత కీలకంగా మారిన ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్ ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి వెళ్లింది. యుద్ధ విమానాల తయారీకి వాడే రేర్ ఎర్త్ మూలకాలపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. చైనా ఇటీవల ప్రకటించిన పంచవర్ష ప్రణాళికలో.. అమెరికా F-35 జెట్లు, ఇతర ఆధునిక రక్షణ వ్యవస్థలపై.. యుద్ధం లేకుండానే చెక్ పెట్టగల విధానాన్ని సూచిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల సరఫరాలో చైనాదే ఆధిపత్యం అని చెప్పొచ్చు. ఈ మూలకాలపై ఎగుమతుల విధానాన్ని డ్రాగన్ కఠినతరం చేస్తోంది. అమెరికా ఇరాన్ లాంటి సవాళ్లలో బిజీగా ఉండగానే.. చైనా దీర్ఘకాలిక, వ్యూహాత్మక సమతుల్యని సృష్టించే అవకాశాన్ని ఉపయోగిస్తోంది. ఈ ప్రణాళిక.. ఓ సాధారణ ఆర్థిక పత్రంలా కాకుండా, రాబోయే దశాబ్దాల్లో చైనా సైనిక, ఆర్థిక బలాన్ని నిర్ణయించే అత్యాధునిక టెక్నాలజీలపై.. ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసే సమగ్ర వ్యూహంగా కనిపిస్తోంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోటిక్స్, క్వాంటం కమ్యూనికేషన్, మానవ మెదడు-కంప్యూటర్ ఇంటర్ఫేస్ల లాంటి టెక్నాలజీలను కేంద్రబిందువుగా ఉంచిన ఈ ప్రణాళిక.. చైనాకు ఆర్థిక, సైనిక పరిధిలో కీలక ప్రయోజనాలను ఇస్తుంది.
చైనా సరికొత్త వ్యూహం ఏమిటంటే.. రేర్ ఎర్త్ మినరల్స్ని నియంత్రించడమే. అమెరికా ఎఫ్-35 జెట్ల ఇంజిన్లు, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామాగ్రి లాంటివన్నీ.. ఎక్కువగా ఈ మూలకాలపైనే ఆధారపడిఉన్నాయ్. డ్రాగన్ ఇప్పటికే.. ఈ సప్లై చైన్ని కుదించి, ఎగుమతి నియంత్రణ విధానాలను, లైసెన్స్ అవసరాలను, ప్రపంచ సరఫరాపై సూక్ష్మ నియంత్రణని అమలు చేసింది. ప్రతి ఎఫ్-35 యుద్ధ విమానంలో.. 435 కిలోల రేర్ ఎర్త్ మూలకాలు ఉంటాయి. ఇవి ఇంజిన్లు, రాడార్లు, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థల్లో కీలకమైనవి. ఈ ఖనిజాలను శుద్ధి చేయడంలో.. 90 శాతానికి పైగా ఆధిపత్యం చైనాకు ఉంది. చైనా గనక ఈ సరఫరాలని నిలిపివేస్తే.. అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలను తయారు చేయలేకపోయే పరిస్థితి వస్తుంది. చైనా గతంలో కేవలం ఖనిజాల ఎగుమతిపై కంట్రోల్ కలిగి ఉండగా.. ఇప్పుడు ప్రాసెసింగ్ టెక్నాలజీలోనూ డామినేషన్ చూపిస్తోంది. విదేశీ కంపెనీలు చైనా నుంచి ప్రత్యేక లైసెన్సులు లేకుండా ఖనిజాలను పొందలేరు. ముఖ్యంగా.. యూఎస్ రక్షణ రంగానికి అనుబంధ సంస్థలకు లైసెన్సులు నిరాకరించడం ద్వారా.. అమెరికా సైనిక సామర్థ్యాన్ని చైనా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే.. వందకు పైగా ఎఫ్-35 యుద్ధ విమానాల డెలివరీలు ఆలస్యమైనట్లు తెలుస్తోంది. చైనా రేర్ ఎర్త్ నియంత్రణ, ప్రాసెసింగ్ కంట్రోల్ ద్వారా, యుద్ధం జరగకముందే.. అమెరికా అత్యాధునిక ఫైటర్ జెట్ల కెపాసిటీపై ప్రభావం చూపగలదు. ఇది.. చైనాకు యుద్ధం లేకుండానే చేసే సైలెంట్ వార్గా సాధ్యమవుతుంది. భవిష్యత్తులో గ్లోబల్ సూపర్ పవర్ పోటీలో.. అమెరికాని నియంత్రించే అవకాశం.. చైనాకు ఇస్తుంది.
చైనా ఫైవ్ ఇయర్ ప్లాన్లో.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాబోయే పదేళ్లలో చైనా తన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం ఏఐని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. చైనా పంచవర్ష ప్రణాళికలో.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ను ఓ పిల్లర్ ఇండస్ట్రీగా గుర్తించింది. ఐదేళ్లలో వీటి ఉత్పత్తి డబుల్ అవుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా స్పేస్-ఎర్త్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని నిర్మించడం, న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ని వేగవంతం చేయడం, హ్యూమన్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని డెవలప్ చేయడం లాంటి వాటికి కూడా చైనా ప్లాన్ చేసుకుంది. డ్రాగన్ ఆర్థిక ఆశయాలు కూడా ఎంతో అట్రాక్టివ్గా ఉన్నాయ్. వచ్చే ఐదేళ్లలో ఏఐ సంబంధిత పరిశ్రమల విలువే 10 ట్రిలియన్ యువాన్లని మించిపోతాయని అంచనా వేసింది. అమెరికా కరెన్సీలో 1.4 ట్రిలియన్ డాలర్లు. దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాల కోసం.. టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం, దానిని స్టేట్ పాలసీతో లింక్ చేయడంపైనే ఇప్పుడు చైనా దృష్టి పెట్టింది. ఇది.. పరిశ్రమలకు ఎంతో ఊతమిస్తుందని నమ్ముతోంది. చైనా విస్తృతిలో ఇదొక టర్నింగ్ పాయింట్గా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. అందుకే.. ఇది చైనా ఆర్థిక ప్రణాళిక కాదని, అమెరికా పోరాడని యుద్ధానికి సంబంధించిన వార్ ప్లాన్ అని అంటున్నారు.
చైనా టెక్నాలజీ పురోగతికి.. అమెరికా ఇప్పటివరకు ఇచ్చిన కౌంటర్ 2022లో తెచ్చిన చిప్స్, సైన్స్ చట్టం. యూఎస్లో సెమీకండక్టర్ చిప్స్ ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు ఈ యాక్ట్ని తెచ్చారు. దాంతో.. ఈ చట్టం చిప్స్ ఉత్పత్తికి మాత్రమే సెంటర్ పాయింట్గా ఉంది. కానీ.. ఇక్కడ మేజర్ మ్యాటర్ చిప్స్ గురించి కాదు. చైనా స్ట్రాటజీ చాలా పెద్దదిగా కనిపిస్తోంది. మొత్తం ఆర్థిక వ్యవస్థను, అత్యాధునిక పరిశ్రమల నుంచి సేవల వరకు, నిర్దేశిత వార్ ప్లాన్ పరిధిలోకి తెస్తుంది. ముఖ్యంగా.. రేర్ ఎర్త్ మెటీరియల్స్, రోబోటిక్స్, ఏఐ పరిశ్రమలను.. ఒకే వ్యవస్థలో లాక్ చేయాలని చూస్తోంది. వీటి ద్వారా పారిశ్రామిక ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. భవిష్యత్తులో అమెరికా F-35లు ఆకాశంలో ఎగరడానికి కావాల్సిన ప్రతి అవకాశం.. చైనా నియంత్రణలోకి వస్తుంది. చైనా పంచవర్ష ప్రణాళిక.. క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష మౌలిక సదుపాయాలు, అధునాతన ఎలక్ట్రానిక్ సామాగ్రి ఉత్పత్తులు, రేర్ ఎర్త్ మెటీరియల్స్ ప్రాసెసింగ్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. అందువల్ల.. చిప్స్ చట్టం అనేది అమెరికాకు ఓ రైఫిల్ లాంటిదైతే.. డ్రాగన్ ప్రకటించిన పంచవర్ష ప్రణాళిక.. ఓ ఆయుధశాల అంటున్నారు. చైనా లోహాలు, రోబోటిక్స్, AI సామాగ్రిని కంట్రోల్లో ఉంచడం ద్వారా.. భవిష్యత్తులో సైనిక పోటీ అంతర్గత సప్లై చైన్ల ద్వారా డిసైడ్ అవుతుంది. కాబట్టి.. యుద్ధం లేకుండానే.. అమెరికా అత్యాధునిక ఫైటర్ జెట్ల సామర్థ్యంపై ప్రభావితం చేయగలిగే వ్యూహం ఇది.
చైనా దగ్గర రేర్ ఎర్త్ మినిరల్స్ చాలా ఉన్నాయ్. ఫైటర్ జెట్స్ మాత్రమే కాదు మిసైల్ డిఫెన్స్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు, గైడెడ్ మందుగుండు సామగ్రి తయారీలోనూ అవే కీలకం. అందువల్ల.. కొన్నేళ్లుగా చైనా వీటి విషయంలో పట్టు బిగిస్తోంది. రేర్ ఎర్త్ మూలకాలు, వాటి ప్రాసెసింగ్ టెక్నాలజీలని కవర్ చేసేందుకు ఎగుమతి నియంత్రణ విధానాలను విస్తరించింది. ఈ క్రమంలో కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. 2027 జనవరి నుంచి అమెరికాతో రేర్ ఎర్త్ మూలకాలకి సంబంధించిన ఒప్పందాలను దశలవారీగా తొలగించాలని భావిస్తున్నారు. దీనివల్ల.. అమెరికా సప్లయర్లు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది. పైగా.. ఇరాన్తో ఘర్షణల్లో అమెరికా భారీగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్న మందుగుండు సామాగ్రిని వాడుతోంది. ఇరాన్ వార్.. యూఎస్ ఇంటర్సెప్టర్లని తినేస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు.. చైనా ఇంటర్సెప్టర్లని నిర్మించే సప్లై చైన్ని నిర్మిస్తోంది. దానినే.. నేషనల్ స్ట్రాటజీగా మార్చే పత్రమే ఈ పంచవర్ష ప్రణాళిక. యుద్ధ విమానాలు, మందుగుండు సామాగ్రి తయారుచేసేందుకు అవసరమైన అనేక పదార్థాలను.. రాబోయే పదిహేనేళ్ల పాటు చైనా నియంత్రణలో ఉండేలా చూసుకోవడమే.. జిన్పింగ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ రోడ్ మ్యాప్ టార్గెట్. ఇందులో గనక చైనా సక్సెస్ అయితే.. ఆ తర్వాత గ్లోబల్ సూపర్ పవర్ పోటీ మొదలవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read:యుద్ధం అక్కడ.. మంట ఇక్కడ! గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలైన్లు.. హోటళ్లు క్లోజ్!
Story by: Anup, Big Tv