IndiGo Refund: ఇండిగో విమానాల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా ఆరో రోజు ఇండిగో విమానాల రద్దు కొనసాగింది. అయితే రద్దైన విమానాల వాపసులను డిసెంబర్ 7 రాత్రి 8 గంటల లోపు రీఫండ్ చేయాలని కేంద్రం ఇండిగోను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు రూ.610 కోట్ల వాపసులను ప్రాసెస్ చేసినట్లు ఇండిగో ప్రకటించింది. అలాగే 3,000 లగేజీలను డెలివరీ చేసినట్లు పేర్కొంది.
ఇండిగో విమానాల టికెట్ల రీఫండ్కు సంబంధించి ఇప్పటి వరకు రూ.610 కోట్ల మేర చెల్లింపులు చేసినట్లు కేంద్ర పౌర విమానయానశాఖ ప్రకటించింది. విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణాలను రీషెడ్యూల్ చేసేందుకు ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయొద్దని కేంద్రం ఆదేశించింది. టికెట్ల రీఫండ్ ప్రక్రియను ఆదివారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని, లగేజీని రెండు రోజుల్లో డెలివరీ చేయాలని కేంద్రం శనివారం ఇండిగోను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ సంక్షోభం నుంచి బయటపడటంతో పాటు సర్వీసుల పునరుద్ధరణకు సీఈవో, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
ఇండిగో విమానాలు పూర్తి స్థాయిలో క్రమబద్దీకరించేందుకు అన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విమాన కార్యకలాపాలు క్రమంగా పూర్వస్థితికి వస్తున్నాయని, ఇండిగో పనితీరు క్రమంగా మెరుగుపడుతుందని పేర్కొంది. విమాన కార్యకలాపాలు శుక్రవారం 706 నుంచి శనివారం 1,565 కు పెరిగాయి. నేటికి 1,650కి చేరుకునే అవకాశం ఉందని ఇండిగో తెలిపింది.
విమాన సర్వీసుల క్రమంగా పూర్వస్థితికి వస్తున్నప్పటికీ, దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో ఆదివారం గందరగోళం కొనసాగింది. దేశవ్యాప్తంగా మొత్తం 650 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. హైదరాబాద్, కోల్కతా, దిల్లీలో ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి.
Also Read: Indigo Flights: ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసులు..
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 115 సర్వీసులు రద్దు అయ్యాయి. దిల్లీ ఎయిర్ పోర్టులో 109 విమానాలు రద్దు అయ్యాయి. కోల్కతాలో 76 విమాన సర్వీసులు నిలిచిపోయాయి.