Rohini Acharya: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు తీవ్రమయ్యాయి. ఆర్జేడీ నుంచి తప్పుకుంటున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య శనివారం ప్రకటించారు. తాజాగా ఆమె సంచలన ప్రకటన చేశారు. తన సోదరుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తేజస్వి యాదవ్ తనను తీవ్రంగా అవమానించారని, దుర్భాషలాడారని రోహిణీ ఆరోపించారు. తేజస్వి తనను కొట్టడానికి చెప్పు తీశారని ఎక్స్ లో పోస్టు పెట్టారు.
రోహిణీ ఆచార్య తన ఎక్స్ ఖాతాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన గౌరవాన్ని కాపాడుకోవడానికి కన్నీళ్లతో తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిని విడిచిపెట్టి బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందన్నారు. “నిన్న ఒక కుమార్తె, ఒక సోదరి, ఒక మహిళ, ఒక తల్లిని అవమానించారు. ఆమెపై అసభ్యకరంగా మాట్లాడారు. ఆమెను కొట్టడానికి చెప్పు ఎత్తారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేదు. నేను సత్యాన్ని వదులుకోలేదు. అందుకే ఆ అవమానాన్ని భరించాల్సి వచ్చింది. నిన్న ఒక కుమార్తె, బలవంతంగా కన్నీళ్లతో తల్లిదండ్రులను, సోదరీమణులను విడిచి బయటకు వచ్చింది. వారు నన్ను నా తల్లి ఇంటి నుండి దూరం చేశారు. నన్ను అనాథను చేశారు. ఏ కుటుంబంలో రోహిణీ లాంటి సోదరి ఉండకూడదు” అని పోస్టు పెట్టారు.
మరో పోస్టులో 2022లో తన తండ్రికి చేసిన కిడ్నీ దానం గురించి ప్రస్తావించారు. తనపై వ్యక్తిగత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తన తండ్రికి ఇచ్చిన కిడ్నీని మురికి కిడ్నీగా ఎగతాళి చేశారని ఆరోపించారు. మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితే వస్తే కొడుకు లేదా సోదరుడి కిడ్నీ ఇవ్వమని అడగండన్నారు. ‘సోదరీమణులు, కుమార్తెలందరూ మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను నా కుటుంబాన్ని, నా ముగ్గురు పిల్లలను చూసుకోకపోవడం, కిడ్నీ డొనేట్ చేసే ముందు నా భర్త లేదా నా అత్తమామల నుంచి అనుమతి తీసుకోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. కిడ్నీ దానం చేసినందుకు నాపై మురికి ముద్ర వేశారు” అని రోహిణీ పోస్టు పెట్టారు. తనను ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ ఖాన్, తేజస్వి యాదవ్ కుటుంబం నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు.
Also Read: RJD: ఆర్జేడీకి బిగ్ షాక్.. రాజకీయాలకు రోహిణి ఆచార్య గుడ్ బై
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర ఓటమి పాలైంది. తేజస్వి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆర్జేడీ 143 సీట్ల పోటీ చేసి 25 సీట్లను మాత్రమే గెలిచింది. 100 సీట్లకు పైగా కోల్పోయింది. లాలూ కుటుంబంలో విభేదాలు ఇదే మొదటిసారి కాదు. ఇటీవల లాలూ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో తేజ్ ప్రతాప్ తన సొంత పార్టీ జనశక్తి జనతాదళ్ (జేజేడి) ఏర్పాటు చేశారు. ఆయన మహువా నుంచి పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు.