Lok Sabha: ఎట్టకేలకు రెండు దశాబ్దాల తర్వాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- ఎంజీనరేగా రద్దయ్యింది. దాని స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చింది మోదీ సర్కార్. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’-VB-G RAM G బిల్లుకు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార-విపక్షాల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి.
జీ-రామ్-జీ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఈ క్రమంలో విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. అయినా పాలకపక్షం అవేమీ పట్టించుకోలేదు. ఒకానొక దశలో విపక్ష ఎంపీలు వెల్లోకి వచ్చి నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష నేతలు ఆ బిల్లు ప్రతులను చించి విసిరేశారు. సభ్యుల ఆందోళన నడుమ ఓటింగ్ నిర్వహించారు స్పీకర్. దీంతో VB G RAM G Bill కు ఆమోదం లభించింది. గందరగోళం నేపథ్యంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది.
20 ఏళ్ల ఎంజీనరేగా స్థానంలో VB-G RAM G బిల్లు వచ్చింది. లోక్ సభ ఆమోదం తెలిపింది. ఇక రాజ్యసభ కూడా ఆమోదం వేస్తే అప్పుడు బిల్లుగా మారనుంది. కొత్త బిల్లులో ప్రతీ ఏడాది పని దినాలు 125 రోజుల పాటు అమలు కానున్నాయి. ఈ బిల్లుపై ఎనిమిది గంటల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. మహాత్మాగాంధీ ఆదర్శాలను నిలబెట్టుతుందని నొక్కి వక్కానించారు.
వ్యతిరేకించిన కాంగ్రెస్ సహా విపక్షాలు
బాపు ఆదర్శాలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ కింద నిర్మించిన పక్కా ఇళ్లు పేదల జీవితాల్లో మార్పు తెచ్చినవేనని చెప్పారు. ఈ బిల్లు గ్రామాల సర్వతోముఖాభివృద్ధిని నిర్ధారిస్తుందన్నారు. పేదరిక రహితంగా మారుస్తుందని, గ్రామీణుల ప్రయాణానికి ఇంధనంగా నిలుస్తుందన్నారు. 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ పేరును NREGAలో చేర్చారని తెలిపారు.
తగ్గుతున్న పేదరికం, డిజిటల్ యాక్సెస్, నిధుల దుర్వినియోగం, బలహీనమైన పర్యవేక్షణ విధానాలు, ఈ పథకం పని తీరు వంటి సవాళ్లను ఎత్తి చూపారు. అధికారిక సమాచారం మేరకు.. 2024-25 ఏడాదిలో రూ. 193.67 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. గ్రామీణ కుటుంబాల్లో కేవలం 7.61 శాతం మాత్రమే MGNREGA కింద 100 రోజుల పనిని పూర్తి చేశారు. కొత్త చట్టం మరింత దృష్టి కేంద్రీకరించి జవాబుదారీతనం, సాంకేతికత ఆధారిత వ్యవస్థతో భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
ALSO READ: కళ్లుండి చూడలేని లోకానికి.. కళ్లతోనే చూపు నిచ్చింది
ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ జై ప్రకాష్ మాట్లాడుతూ.. జాతిపిత పేరును చట్టం నుండి తొలగించడం అతిపెద్ద నేరంగా వర్ణించారు. ఈ చట్టం రాష్ట్రాలకు కొత్త ఆర్థికభారం అవుతుందన్నారు. గ్రామసభలు ఈ పథకం కింద పనులపై నిర్ణయం తీసుకునే హక్కును కోల్పోతుందన్నారు. ఈ బిల్లు ముమ్మాటికీ పేదలు-దళితులకు వ్యతిరేకంగా అభివర్ణించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా దీనిపై నోరు విప్పారు. గాంధీ వారసత్వాన్ని మోదీ సర్కార్ అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. MGNREGA ను రద్దు చేయడం, పథకం పేరు మార్చడం ద్వారా రామరాజ్య ఆలోచనను అక్షరాలా నాశనం చేస్తోందన్నారు. గ్రామీణ ఉపాధి చట్టం నుండి గాంధీ పేరును తొలగించడం ద్వారా మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్లను కేంద్రం అగౌరవ పరిచిందని విమర్శించారు.