VC Sajjanar: బెంగళూరులో ఇటీవల జరిగిన ఒక విషాద ఘటన మానవత్వాన్ని మించిన గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని సమాజంపై పగ పెంచుకోకుండా, అదే సమాజానికి వెలుగును పంచిన ఓ మహిళ ఔదార్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (IPS) స్పందిస్తూ, బాధిత మహిళ రూప గొప్పతనానికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బనశంకరి ప్రాంతానికి చెందిన వెంకట రమణన్ (34) ఇటీవల నడిరోడ్డుపై గుండెపోటుతో కుప్పకూలారు. వాహనదారులు, బాటసారులు ఎవరూ సాయం చేయకపోవడంతో, సమయానికి ఆసుపత్రికి చేరక ఆయన మృతి చెందారు. ఆ సమయంలో తన భర్తను కాపాడాలంటూ ఆయన భార్య రూప చేతులెత్తి మొక్కినా ఎవరూ స్పందించలేదు. అయితే, తన భర్త ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ సమాజంపై ఆమె కన్నెర్ర చేయలేదు. “సమాజం నా భర్త ప్రాణాలు కాపాడేందుకు రాలేదు.. కానీ నేను మానవత్వంతో మరో ఇద్దరికి కంటిచూపు ఇవ్వాలని నిర్ణయించుకున్నా” అని రూప తన భర్త కళ్లను దానం చేశారు.
ఈ ఉదంతంపై స్పందించిన సీపీ సజ్జనార్.. “కళ్లుండి కూడా తన బాధను చూడలేని లోకానికి.. తన భర్త కళ్లతోనే ‘చూపు’నిచ్చింది!” అని ప్రశంసించారు. నడిరోడ్డుపై భర్త ప్రాణాల కోసం ఆమె పడ్డ తపనను చూసేందుకు ఈ సమాజానికి కళ్లు చాలలేదని, మనసు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లున్నా గుడ్డిలా ప్రవర్తించిన లోకానికి, తన భర్త కళ్లను దానం చేసి ఆమె మానవత్వపు వెలుగును పంచిందని కొనియాడారు.
సాయం చేయడానికి చేతులు రాని చోట, చూపునిచ్చిన రూపా గారి సంస్కారానికి శిరస్సు వంచి నమస్కరిద్దామని, ఆమె నుంచి సాటి మనిషికి సాయపడటం నేర్చుకుందాం అని సజ్జనార్ పిలుపునిచ్చారు. “Hat’s off to her spirit!” అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.