Shivalik LPG Tanker: పర్షియన్ గల్ఫ్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య 45 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ క్యారియర్ శివాలిక్.. ఇటీవల హర్మూజ్ జల సంధిని దాటిన విషయం తెలిసిందే. శివాలిక్ ట్యాంకర్ గుజరాత్ తీరానికి చేరుకుంది. సోమవారం సాయంత్రం గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు వచ్చింది. శివాలిక్ నౌకలో 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ భారత్కు వచ్చిందని పెట్రోలియం శాఖ తెలిపింది. 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్తో వస్తున్న ‘జగ్ లాడ్కీ’ నౌక మంగళవారం భారత్కు చేరుకోనుంది.
పర్షియన్ గల్ఫ్కు వెస్ట్ లో భారత్ కు చెందిన 22 నౌకలు ఉండగా, వాటిల్లో 616 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారని షిప్పింగ్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇరాన్ తో భారత దౌత్యపర సంబంధాలతో హర్మూజ్ జలసంధి మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతించింది. ఈ క్రమంలో భారత జెండాలు కలిగిన రెండు ఎల్పీజీ నౌకలు రెండు రోజుల క్రితం సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. వీటిల్లో ఒకటి శివాలిక్ కాగా, మరొకటి నందాదేవి. శివాలిక్ ట్యాంకర్ సోమవారం సాయంత్రం భారత్ చేరుకుంది. నందాదేవి ట్యాంకర్ 45 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ తో త్వరలోనే భారత్ చేరుకోనుంది.
శివాలిక్ భారీ ఎల్పీజీ క్యారియర్. మహాసముద్రాల మార్గాల్లో ఎల్పీజీ గ్యాస్ ను రవాణా చేయడానికి రూపొందించిన ఒక ప్రత్యేక నౌక. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ నౌక.. ఇంధన రవాణాను బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా సెప్టెంబర్ 10, 2025న ఇండియన్ నేవీలో చేరింది. ఈ నౌక దాదాపు 225 మీటర్ల పొడవు, దాదాపు 36 మీటర్ల బీమ్ కలిగి ఉంటుంది. దీని కార్గో ట్యాంకులు దాదాపు 82,000 క్యూబిక్ మీటర్ల ఎల్పీజీని స్టోర్ చేయగలదు. ఇది 40,000 నుంచి 46,000 టన్నుల ఎల్పీజీని రవాణా చేయగలదు.
దక్షిణ కొరియాలో నిర్మించిన ఈ ట్యాంకర్.. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా.. ఎల్పీజీని నిర్వహించడానికి రూపొందించారు. ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధిని దాటిన తర్వాత ఈ నౌక అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో దాదాపు 20 శాతం పర్షియన్ గల్ఫ్ను అంతర్జాతీయ జలాలకు వెళ్లాలంటే.. ఇరుకైన హర్మూజ్ మార్గంలో ప్రయాణించాలి. ఈ ప్రాంతంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.
Also Read: భారత్ కు గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన రెండు ఎల్పీజీ నౌకలు
భారత్ లో వంట గ్యాస్ తీర్చడానికి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఎల్పీజీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. శివాలిక్ వంటి నౌకలు గల్ఫ్ ఉత్పత్తిదారుల నుంచి భారతీయ ఓడరేవులకు ఎల్పీజీని మోసుకొస్తాయి. విదేశీ షిప్పింగ్ కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం LPG క్యారియర్లను నిర్మించింది. శివాలిక్ నౌక విశాఖపట్నం ఓడరేవు, హల్దియా డాక్ కాంప్లెక్స్, కాండ్లా ఓడరేవు, న్యూ మంగళూరు ఓడరేవు వంటి ప్రధాన ఓడరేవులకు చేరుకుంటుంది.