Vemula Prashanth Reddy: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్లగా, అబద్ధాలతో నిండిపోయిందని, ప్రజలకు ఉపయోగపడే స్కీం ల కంటే స్కామ్లే ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమేనని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కల్వకుంట్ల సంజయ్, కౌశిక్ రెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ను గవర్నర్ చదవడం తప్ప ఈ ప్రసంగంలో కొత్తదనం ఏమాత్రం కనిపించలేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీలు గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని విమర్శించారు.
ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండేళ్లుగా మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని, ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు.వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు ₹4,000 పెన్షన్, దివ్యాంగులకు ₹6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని విమర్శించారన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, కొత్త పెన్షన్ల మంజూరుపై కూడా గవర్నర్ ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేదని, తులం బంగారం హామీ అటకేక్కించారని మండిపడ్డారు.
రైతులకు ₹2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పించడం పూర్తిగా అబద్ధమన్నారు. ఎకరాకు ₹15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. ఇప్పటికి రెండు సార్లు ఇచ్చి మూడు సార్లు ఎగొట్టి రైతులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. క్వింటాలుకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు రైతులకు అందలేదని, కొద్దిమందికి మాత్రమే ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం సుమారు 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కానీ గవర్నర్ ప్రసంగంలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పించడం వాస్తవాలకు విరుద్ధం అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
Also Read: Ban vs Pak: 15 సెకండ్లపై వివాదం..బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ ఫిర్యాదు..అంపైర్లు అమ్ముడుపోయారంటూ