Farmer Sell Kidney: వ్యవసాయం ఆ రైతుకు శాపంగా మారింది. నిరంతర నష్టాలను చవి చూశాడు. కనీసం ఒక్క ఏడాది కూడా ఆ రైతుకు రిలీఫ్ లభించలేదు. అప్పులు తడిచి మోపుడవుతున్నాయి. ఫలితంగా వ్యవసాయానికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాడు. చివరకు పాల వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. వడ్డీ వ్యాపారుల నుంచి లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాడు. చివరకు 74 లక్షలు అయ్యింది. దాన్ని కట్టలేక తన కిడ్నీని అమ్ముకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలో ఓ రైతుకు శాపంగా మారిన వ్యవసాయం
వ్యవసాయంతో లక్షలు గడిచేవారు ఉన్నారు. ట్రెండ్ అనుగుణంగా అడుగులు వేస్తున్నారు కొందరు రైతులు. పరిస్థితులకు తగ్గట్టుగా పంటలు మారుస్తూ, అప్పుడప్పుడు కమర్షియల్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. సాప్ట్ వేర్ ఇంజనీర్లు కూడా వ్యవసాయంలోకి దిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ పైన కనిపిస్తున్న రైతుకి వ్యవసాయంలో నిత్యం నిరాశ ఎదురైంది.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే రైతు వ్యవసాయం చేసేవాడు. ఒక ఏడాది కాకపోతే.. మరో ఏడాదైన కలిసి వస్తుందనే ఆశతో వృత్తిని కొనసాగించాడు. రాను రాను నష్టాలు పెరుగుతున్నాయో తప్ప, అప్పులు తీరలేదు.
లక్షకు 74 లక్షల వడ్డీ.. అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్మిన అన్నదాత
ఫలితంగా వ్యవసాయం మానేసి పాల వ్యాపారం మొదలుపెట్టాలని భావించాడు. అందుకు వడ్డీ వ్యాపారులను కలిశాడు. బ్రహ్మపురి పట్టణానికి చెందినవారు. కిషోర్ బవాంకులే, మనీష్ కల్బందే, లక్ష్మణ్ ఉర్కుడే, ప్రదీప్ బవాంకులే, సంజయ్ బల్లార్పురే, లక్ష్మణ్ బోర్కర్ లు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు.
వారి నుంచి ఆ రైతు లక్ష రూపాయల రుణం తీసుకున్నాడు. పాల వ్యాపారం ప్రారంభమయ్యేలోపు అతడు కొనుగోలు చేసిన ఆవులు చనిపోయాయి. భూమిలో వేసిన పంటలు దెబ్బతిన్నాయి. చివరకు అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. దీంతో వడ్డీ వ్యాపారులు ఆ రైతు కుటుంబాన్ని వేధించడం ప్రారంభించారు.
ALSO READ: ఉపాధి హామీ పేరు మార్పుపై భగ్గుమన్న కాంగ్రెస్, వినూత్న నిరసన
వడ్డీ వ్యాపారుల అప్పు తీర్చడానికి ఆ రైతు తొలుత తన భూమి, ట్రాక్టర్, ఇంట్లో విలువైన వస్తువులు అమ్మేశాడు. అవేమీ సరిపోలేదు. కేవలం లక్ష రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. అందుకు ప్రతీ రోజూ 10 వేల వడ్డీ చెల్లించాలి. చివరకు అసలు-వడ్డీ కలిసి 74 లక్షలకు చేరింది. రైతు పరిస్థితి గమనించిన వడ్డీ వ్యాపారుల్లో ఒకడు చిన్న సలహా ఇచ్చాడు. కిడ్నీని అమ్ముకుంటే బాకీ తీరుతుందని సలహా ఇచ్చాడు.
అందుకోసం ఓ ఏజెంట్ ద్వారా కోల్కతాకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. ఆ తర్వాత కంబోడియా వెళ్లాడు. అక్కడ తన కిడ్నీని రూ.8 లక్షలకు అమ్మేశాడు. రోజు రోజుకూ రైతు ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలాంటి ఫలితం దక్కలేదు. తనకు న్యాయం చేయకుంటే కుటుంబంతో ముంబైలోని సచివాలయం ముందు ఆత్మాహుతి చేసుకుంటానని అంటున్నాడు. రైతు వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.