భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళా నేతగా గుర్తింపు పొందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి వార్తల్లో నిలిచారు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను పరిశీలిస్తే ఆమె అత్యంత పేద ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండటం చూస్తుంటాం. దీనికి విరుద్ధంగా మమతా బెనర్జీ కేవలం లక్షల రూపాయల ఆస్తితో సామాన్య జీవితం గడుపుతున్నారని తాజాగా వెల్లడైన ఆమె అఫిడవిట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మమతా బెనర్జీ మొత్తం ఆస్తుల విలువ రూ.15.37 లక్షలుగా నమోదైంది. గత ఎన్నికల సమయంలో సమర్పించిన వివరాల ప్రకారం ఆమె పేరిట ఎటువంటి స్థిరాస్తులు లేవు. ముఖ్యంగా సొంతంగా నివసించేందుకు ఒక ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె కోల్కతాలోని హరీష్ ఛటర్జీ వీధిలో ఉన్న తన పూర్వీకుల ఇంట్లోనే నివసిస్తున్నారు. దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ఆమె తనకంటూ ఒక సొంత భవనాన్ని నిర్మించుకోకపోవడం విశేషం. ఆమె ప్రయాణాల కోసం ప్రభుత్వం కేటాయించిన వాహనాలను ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆమెకు ఎటువంటి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు.
దీదీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాల వివరాలు సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆమె వద్ద కేవలం 9.8 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. చేతిలో ఉన్న నగదు విషయానికి వస్తే రూ.75,700 మాత్రమే ఉన్నాయి. ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె ఎటువంటి విలాసాలకు పోకుండా నిరాడంబరంగా బతుకుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఆమె ప్రధాన ఆదాయ వనరుగా పుస్తకాల రాయడం ద్వారా వచ్చే రాయల్టీలు అలాగే పెయింటింగ్స్ విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా తీసుకునే జీతాన్ని సైతం ఆమె తీసుకోవడం లేదని సమాచారం.
దేశంలోని ఇతర ముఖ్యమంత్రులతో పోల్చితే మమతా బెనర్జీ ఆస్తుల విలువ చాలా తక్కువ. ఈ జాబితాలో ఆమె తర్వాత స్థానాల్లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ కూడా పరిమితంగానే ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం తక్కువ ఆస్తులు కలిగిన సీఎంల జాబితాలో నిలిచారు. దేశ రాజకీయాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మమతా బెనర్జీ లాంటి నేతలు తమ నిజాయితీని నిరూపించుకుంటున్నారు.
ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ సామాన్యుల పక్షాన నిలిచే మమత తన వ్యక్తిగత జీవితంలోనూ అదే బాటను అనుసరిస్తున్నారు. ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే నిరుపేదగా కొనసాగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె నిరాడంబరత కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎంల ఆస్తుల విశ్లేషణలో ఆమె ప్రథమ స్థానంలో (పేదరికం పరంగా) నిలవడం ఆమె రాజకీయ చిత్తశుద్ధికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ALSO READ: తెలంగాణలో జనాభా గణనకు డేట్ ఫిక్స్.. ఈ తప్పులు అస్సలు చేయకండి?