Census Rules: స్వేచ్ఛ బ్యూరో: భారత జనాభా గణన – 2027 నిర్వహణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. సెన్సస్ చట్టం 1948 ప్రకారం, రాష్ట్రంలో జనాభా గణన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రజల బాధ్యతలు, ప్రభుత్వ నిబంధనలను వివరిస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవోనెంబరు 54 పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 11 మే 2026 నుండి 9 జూన్ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
ఈసారి జనాభా గణనను పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనికోసం 26 ఏప్రిల్ 2026 నుండి మే 10 వరకు గడువు నిర్ణయించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటికి రాకముందే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అయితే సెన్సస్ అధికారులు అడిగే ప్రశ్నలకు ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆచారాల ప్రకారం మహిళలు తమ భర్త, ఇతర వ్యక్తుల పేర్లు చెప్పకూడదనే నిబంధన ఉంటే మినహాయింపు ఉంటుంది. గణన కోసం వచ్చే అధికారులకు నివాస స్థలాల్లోకి ప్రవేశం కల్పించాలి.
Also Read: ఆ నియోజకవర్గాలకు ఇన్చార్జులెవరు?.. గులాబీలో మొదలైన చర్చ..!
ఇంటి నంబర్లు వేయడానికి, గుర్తులు పెట్టడానికి అనుమతించాలి. జనాభా గణన విధులకు ఆటంకం కలిగించినా.. తప్పుడు సమాచారం ఇచ్చినా.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. విధులకు ఆటంకం కలిగించినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. గణన నిమిత్తం వేసిన నంబర్లను, గుర్తులను చెరిపివేసినా జరిమానా ఉంటుంది. నేర తీవ్రతను బట్టి జరిమానాతో పాటు గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుందని సీఎస్ ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Also read: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?