Manda Krishna Madiga: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ గవాయిపై దాడి జరిగి 50 రోజులు గడిచినా, నిందితులపై ఇప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం దారుణమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీజేఐకి మద్దతుగా జంతర్ మంతర్ వద్ద సోమవారం తలపెట్టిన ప్రజాస్వామ్యబద్ధమైన సభకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సీజేఐ దళితుడు కాబట్టే ఆయనపై దాడి చేశారు,” అని మందకృష్ణ ఆరోపించారు. ఈ దాడిని దళితుల ఆత్మగౌరవంపై, రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామని అన్నారు. శాంతియుతంగా, కేవలం మూడు గంటల పాటు సభ నిర్వహించుకుంటామని నవంబర్ 7వ తేదీనే పోలీసులకు లేఖ ఇచ్చినా అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు కేవలం అనుమతి లేకుండా ధర్నా చేయవద్దని మాత్రమే చెప్పిందని, తాము అనుమతి కోరినా ఇవ్వకపోవడం పౌర హక్కులను కాలరాయడమేనని, ఇది దళితుల స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు.
రేపటి ధర్నా కోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి దళిత సంఘాల కార్యకర్తలు ఢిల్లీకి బయల్దేరి మార్గమధ్యలో ఉన్నారని, ఇప్పుడు వారిని ఎలా వెనక్కి పంపాలని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో బాంబు బ్లాస్టింగ్ల తర్వాత కూడా ధర్నాలకు అనుమతులు ఇచ్చారని గుర్తుచేశారు. “ఢిల్లీ వారు ధర్నా చేస్తే అనుమతి ఇస్తారు, కానీ హైదరాబాద్, ఇతర దక్షిణాది రాష్ట్రాల వారు ధర్నా చేస్తే అనుమతి ఇవ్వరా? ఉత్తరాదికి ఒక న్యాయం, దక్షిణాదికి ఒక న్యాయం ఉండొద్దు. అందుకే అంబేద్కర్ గారు హైదరాబాద్ను రెండో రాజధాని చేయాలని అన్నారు. అదే జరిగి ఉంటే మేం అక్కడే ధర్నా చేసేవాళ్లం” అని మందకృష్ణ వ్యాఖ్యానించారు.
Read Also: Chamala Kiran Kumar: కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా బండి సంజయ్ మాట్లాడుతున్నారు: ఎంపీ చామల
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బి.ఆర్. గవాయిపై అక్టోబర్ 6, 2025న కోర్ట్రూమ్లో దాడి ప్రయత్నం జరిగింది. రాకేష్ కిషోర్ (71) అనే సీనియర్ న్యాయవాది ఆయనపైకి షూ విసిరేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
కొంతకాలం క్రితం ఒక కేసు విచారణలో CJI చేసిన “విష్ణువును ప్రార్థించండి” అనే వ్యాఖ్యను “సనాతన ధర్మ అవమానం”గా భావించి, ఆ న్యాయవాది ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఆ న్యాయవాది లైసెన్స్ను సస్పెండ్ చేసింది మరియు క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభమయ్యాయి. CJI (దళిత వర్గానికి చెందిన)పై ఈ దాడిని ఖండిస్తూ దళిత, న్యాయవాద సంఘాలు నిరసనలు తెలిపాయి. MRPS నేత మందకృష్ణ మాదిగ నవంబర్ 17న “చలో ఢిల్లీ”కి పిలుపునిచ్చారు.