Chamala Kiran Kumar: భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ తన కేంద్ర మంత్రి హోదాను మర్చిపోయి, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. హిందువులందరూ ఏ పార్టీలో ఉన్నా బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందంటూ బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అన్నారు.
ఇటీవలి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనే బీజేపీ డిపాజిట్ గల్లంతు అయిందని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు తగ్గడాన్ని ఆయన ప్రశ్నిస్తూ, “బీజేపీ లోపాయికారిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందా? బండి సంజయ్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఆ విషయం మీకు తెలియకపోతే, మీ పార్టీలో ఇంటర్నల్ గా చర్చ చేసుకోండి” అని సవాల్ విసిరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ ఒక కులం, ఒక మతం ఓట్లతో గెలవలేదని, అన్ని వర్గాల వారు ఓట్లు వేసి గెలిపించారని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ప్రజాపాలన’లో భాగంగా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ప్రజలు ఆదరించారని అన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
బండి సంజయ్, కిషన్ రెడ్డి కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలని కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. “సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం పదేపదే ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. గత పాలకులు దౌర్జన్యంగా దోచుకున్న తెలంగాణను కాపాడాలి. మోడీ, అమిత్ షా పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తేవాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఇద్దరు కేంద్ర మంత్రులు చొరవ చూపాలని ఆయన కోరారు.