Vakiti Srihari: మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బిజెపి అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. మహదేవప్ప మృతి పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని, చనిపోయిన వారి కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని.. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తన ఒత్తిడి వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీహరి ఖండించారు. నామినేషన్ వేసిన నాటి నుండి ఇప్పటివరకు తాను మహదేవప్పతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తన ఒత్తిడి వల్లనో లేదా తన పార్టీ కార్యకర్తల వల్లనో ఈ ఘటన జరిగినట్లు తేలితే, ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. మహదేవప్ప భార్యను విచారించి వాస్తవాలు రాబట్టాలని.. జిల్లా ఎస్పీకి త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ‘రాజకీయాలు శాశ్వతం కాదు, మనం అందరం అన్నదమ్ముల్లా కలిసి బ్రతకాలి’ అని హితవు పలికారు. మక్తల్ ప్రాంతాన్ని కక్షపూరిత రాజకీయాలతో భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని.. అప్పటి వరకు సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుతం 6వ వార్డు ఎన్నికను అధికారులు నిలిపివేసినట్లు పేర్కొంటూ, నిజం నిప్పులాంటిదని, అది త్వరలోనే బయటపడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: ఇరాన్ ‘రెడ్ లైన్’ దాటితే.. ఇజ్రాయెల్ ‘డెడ్ లైన్’ ఖాయం!
మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి
మహాదేవప్ప మృతిపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నా
నేను ఒత్తిడి చేస్తేనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
మహాదేవప్ప కుటుంబ సభ్యులకు ప్రగాఢ… pic.twitter.com/CLU9IUaehu
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2026