Meta Layoff : అంతర్జాతీయ టెక్ దిగ్గజం మెటా.. తన ఉద్యోగుల్లో భారీ తొలగింపునకు సిద్ధమైంది. సంస్థ ప్రణాళికల్లో భాగంగా వీరిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు నిర్ణయించగా, వచ్చే వారంలోనే ఈ ప్రక్రియ మొదలు కానుంది. తాజా లే అఫ్ లలో దాదాపు 3,600 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు అని తెలుస్తోంది. ఇటీవలే భారత దిగ్గజ టెక్ సంస్థ ఇన్ఫోసిస్.. ఒక్క మైసూర్ క్యాంపస్ నుంచే 700 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఈ నేపథ్యంలో.. మరో టెక్ దిగ్గజం లేఆఫ్ లను ప్రకటించడంతో.. ఈ రంగంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా.. అంతర్జాతీయంగా ఉన్న తన కార్యాలయాలలో ఈ లేఆఫ్ లను ప్రకటించనుండగా… సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు చెబుతున్నారు. అమెరికా సహా పలు దేశాల్లోని ఉద్యోగులపై ఈ లేఆఫ్ పిడుగు పడనుండగా… ఆ రోజు ఉదయం 5 గంటల నుంచే ఉద్యోగాల కోతకు సంబంధించిన నోటీసులు ఉద్యోగులకు జారీ చేయనున్నారు. అయితే.. స్థానిక నిబంధనల కారణంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్లోని ఉద్యోగులకు ఈసారికి లేఆఫ్ నుంచి తప్పించుకున్నట్లైంది. ఆయా దేశాల వారిని ఈ జాబితా నుంచి తప్పించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మిగతా.. యూరప్, ఆసియా ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఫిబ్రవరి 11-18 ఈ తొలిగింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
నైపుణ్యాలు అందుకోలేని ఉద్యోగుల తొలగింపు..
గత నెలలోనే ఈ తొలగింపునకు సంబంధించిన సమాచారాన్ని మెటా పంచుకుంది. సంస్థలో నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో అత్యల్ప స్కోర్ సాధించే ఉద్యోగుల్లో 5% మందిపై వేటు పడనున్నట్లు వెల్లడించింది. అయితే.. ఈ స్థానాల్లో కొన్నింటిని తిరిగి భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్లు, వ్యాపారానికి కీలకమైన ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ఫిబ్రవరి 11 నుంచి మార్చి 13 వరకు చేపట్టనున్నట్లు వివిధ నివేదికలు తెలుపుతున్నారు. మెటా ఇంజనీరింగ్ వీపీ పెంగ్ ఫ్యాన్.. ఈ నియామక ప్రక్రియ గురించి ఒక అంతర్గత మెమోలో ఉద్యోగులకు సమాచారం అందించారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెటా.. ఏఐ రానున్న రోజుల్లో భారీ మార్పులు తీసుకొస్తుందని మార్క్ జుకర్స్ బర్గ్ వ్యాఖ్యానించారు. తమ దగ్గరున్న చాలా ఏఐ మోడళ్లు మధ్యస్థాయి వరకు కోడింగ్ రాస్తున్నాయని, కేవలం ఫైనల్ చెకింగ్ కోసమే మనుషుల దగ్గరకు వస్తున్నాయని ప్రకటించారు. కాబట్టి.. రానున్న రోజుల్లో సాధారణ కోడింగ్, ఇతర పనులు చేసేందుకు ఉద్యోగులతో పని ఉండదని చెప్పిన జుకర్స్ బర్గ్.. అంతకు మించిన నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. లేదంటే ఉద్యోగుల కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పుడు అదే కోవలో.. ఏకంగా 3,600 మందిపై వేటుకు సిద్ధమవడంతో సంస్థ ఉద్యోగుల్లో చాలా మంది ఆందోళనలో కూరుకుపోయారు.
Also Read : 700 మంది ఉద్యోగుల తొలగింపు – బౌన్సర్లతో బయటకు నెట్టించిన ఇన్ఫోసిస్
మెటా తో పాటు అంతర్జాతీయంగా ఉన్న అనేక సంస్థలు ఇదే దోవలో వెళుతున్నాయి. సంస్థల్లో అవసరాలకు తగ్గట్టు అంతర్గాత పరీక్షలు నిర్వహిస్తూ, నైపుణ్య స్థాయిల్ని అందుకోలేని వ్యక్తులకు ఉద్వాసన చెబుతున్నాయి. వారి స్థానాల్లో కొత్త వారికి, మరిన్ని నైపుణ్యాలున్న వారిని నియమించుకుంటున్నాయి.