Varanasi Wedding: వావ్.. పడవలో పెళ్లి.. వినడానికే ఎంతో కొత్తగా.. ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా.. అయితే ఇప్పుడు అది నిజంగానే జరిగింది. వారణాసిలోని ఆధ్యాత్మిక పరిమళం ప్రపంచవ్యాప్త ప్రేమికులను ఆకర్షిస్తోంది. అయితే మెక్సికోకు చెందిన రూయిజ్ కాబ్రోల్, గొంజలో మిగ్యుల్ అనే జంట భారతీయ సనాతన ధర్మంపై ఉన్న మక్కువతో వేల కిలోమీటర్ల దూరం నుండి కాశీ క్షేత్రానికి చేరుకున్నారు. కేవలం పర్యాటకులుగా రావడం కంటే, తమ జీవితాంతం గుర్తుండిపోయేలా హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. గంగా నది అలలపై తేలియాడే పడవను కళ్యాణ వేదికగా మార్చుకుని, ప్రకృతి సాక్షిగా వారు ఒక్కటయ్యారు.
ఈ వివాహ వేడుకలో వరుడు గొంజలో సాంప్రదాయ ధోవతి, కుర్తా ధరించి భారతీయుడిలా కనిపించగా, వధువు రూయిజ్ కాశీ ప్రత్యేకం అయిన బనారస్ పట్టుచీరలో మెరిసిపోయింది. అస్సీ ఘాట్ సమీపంలో అలంకరించిన పడవలో అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి, ఆచార్య దీపక్ పాండే ఆధ్వర్యంలో వేద మంత్రాల సాక్షిగా ఈ వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. విదేశీయులైనప్పటికీ, హిందూ వివాహ పద్ధతులైన మంగళసూత్ర ధారణ, సప్తపది వంటి క్రతువులను వారు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం విశేషం.
గంగా హారతి జరిగే సమయంలో, నది మధ్యలో జరుగుతున్న ఈ వినూత్న పెళ్లిని చూసేందుకు స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు భారీగా తరలివచ్చారు. పడవలో పెళ్లి జరుగుతుండగా ఒడ్డున ఉన్న పర్యాటకులు ఈ జంటపై పూలవర్షం కురిపించి తమ శుభాకాంక్షలు తెలిపారు. గంగానది పవిత్రత, వేద మంత్రాల ధ్వని, సాయంత్రపు దీపాల కాంతుల మధ్య జరిగిన ఈ వేడుక ఒక అపురూప దృశ్యంలా అనిపించిందని అక్కడి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read: 25 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ వివరాలివే
నేటి ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాల వారు భారతీయ సంస్కృతిలోని లోతును, ఆధ్యాత్మికతను గౌరవిస్తున్నారనడానికి ఈ వివాహమే నిదర్శనం. భాషలు వేరైనా, ప్రాంతాలు దూరమైనా భారతీయ సంప్రదాయం కలిపే బంధం గొప్పదని ఈ మెక్సికో జంట నిరూపించింది. ఈ అద్భుత ఘట్టాలను అక్కడి వారు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో, గంగా తీరాన జరిగిన ఈ “పడవ పెళ్లి” ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.