TG ARSK Centers: స్వేచ్ఛ బ్యూరో: ఏఆర్ఎస్ కే సెంటర్లదే హవా కొనసాగుతుంది. వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకు రైతులు యూరియా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరైనా ప్రశ్నిస్తే యూరియా లేదనే సమాధానం. క్యాన్సల్ చేసుకోండి అని సెంటర్ల నిర్వాహకులు బదులిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో బస్తాకు అదనంగా వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఏఆర్ఎస్ కే(ఆగ్రో రైతు సేవా కేంద్రం) కేంద్రాలు వెయ్యికి పైగా ఉన్నాయి. అయితే ఆ కేంద్రాలకు మార్క్ ఫెడ్ ద్వారా యూరియా పంపిణీ చేస్తుంది. ట్రాన్స్ పోర్టు చార్జీలు లేకుండా అందజేస్తుంది. రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటుంది. యూరియా యాప్ తో బుక్ చేసుకున్న రైతులకు బస్తాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కేంద్రాల నిర్వాహకులు మాత్రం ఎంత ధర నిర్ణయిస్తే అంతేధరకు రైతులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బస్తాకు 266 రూపాయలు ఎమ్మార్పీని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సెంటర్ల నిర్వాహకులు మాత్రం 350 నుంచి 400వరకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఎమ్మార్పీ ధరకంటే ఎందుకు అదనంగా అమ్ముతున్నారని ప్రశ్నిస్తే వారికి యూరియా అయిపోయిందని, లోడ్ వస్తే ఇస్తామని రోజుల తరబడి కేంద్రం చుట్టూ తిప్పించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Mayank Agarwal: దమ్ముంటే కొట్టరా…ప్రత్యర్థికి గ్రౌండ్ లోనే వార్నింగ్ ఇచ్చిన మయాంక్ అగర్వాల్
ఇదెలా ఉంటే అండ్రాయిడ్ ఫోన్ లేని రైతులు ఆగ్రో రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి యూరియా బుక్ చేయాలని కోరితే 4 బస్తాలు బుక్ చేసి 2 బస్తాలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం రైతులకు తెలియకపోవడంతో నష్టపోతున్నట్లు సమాచారం. దీనికి తోడు అలా బుక్ చేసిన యూరియా ఆగ్రో రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు ఇతరులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం జిల్లాకు ఒక అధికారిని నియమించింది. అయితే వారి మానిటరింగ్ లేకపోవడంతోనే ఏఆర్ఎస్ కే కేంద్రాల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాట గ తయారైందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ కేంద్రాలపై నిత్యం అధికారులు మానిటరింగ్ చేయాలని పలువురు కోరుతున్నారు.
మరోవైపు మార్క్ ఫెడ్ అధికారులు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కైనట్లు ప్రచారం జరుగుతుంది. హాలియా నియోజకవర్గంలోని ఓ మండలంలో ఉన్న ఆగ్రో రైతు సేవా కేంద్రానికి ప్రతి రోజూ యూరియా బస్తాలను అధికారులు సరఫరా చేస్తున్నారు. ఆ సెంటర్ యజమాని మాత్రం బస్తాకు 100 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర పీఏసీఎస్ లకు గానీ, డీసీఎంఎస్, ఎఫ్పీఓ(రైతు ఉత్పత్తిదారుల సంఘం)లకు గానీ సరఫరా చేయకుండా కేవలం ఏఆర్ఎస్ కే సెంటర్ కే సరఫరా చేస్తుండటంపై పలువురు మండిపడుతున్నారు. అంటే అధికారుల చేతివాటమే కారణమనే ప్రచారం జరుగుతుంది. ఇలా ఈ ఒక్క సెంటరే కాదు.. చాలా కేంద్రాలకు ఇలాగే సరఫరా అవుతుందని, మార్క్ ఫెడ్ అధికారుల కనుసన్నల్లోనే దందా నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియా బస్తాకు అదనంగా వసూల్లు చేయకుండా ఎమ్మార్పీ ధరకే విక్రయించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Also Read: Gandhi Hospital IVF: సర్కారీ ఆసుపత్రుల్లో సంతాన భరోసా.. నమ్మకంతో క్యూకడుతున్న జనం