Shitala Mata Temple Nalanda Stampede: బీహార్లోని నలంద జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం బీహార్ షరీఫ్ సమీపంలోని ప్రసిద్ధ శీతలా మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చైత్ర మాసపు చివరి మంగళవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పట్నా సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఒకేసారి దర్శనం కోసం రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లలో క్రమశిక్షణ లేకపోవడం, అందరూ ఒకేసారి గర్భాలయం వైపు దూసుకురావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఆలయ నిర్వహణలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. “ప్రతి మంగళవారం ఇక్కడ రద్దీ ఉంటుంది, కానీ ఈసారి చైత్ర మాసం చివరి వారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. సరైన క్యూలైన్లు లేకపోవడం, భక్తులను నియంత్రించడంలో విఫలం కావడం వల్లే ఈ మరణాలు సంభవించాయి” అని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనకు బాధ్యునిగా భావిస్తూ దీప్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజ్మణిని ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది.
ఈ ఘటన జరిగిన సమయంలో నలంద జిల్లా యంత్రాంగం అంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. రాష్ట్రపతి నేడు నలంద శిథిలాలను సందర్శించాల్సి ఉంది. ఆలయానికి మరియు రాష్ట్రపతి పర్యటించే ప్రాంతానికి మధ్య దూరం తక్కువగానే ఉండటంతో, అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నలంద అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నూరుల్ హక్ ఘటనా స్థలానికి చేరుకుని, ఎనిమిది మంది మహిళలు మృతి చెందినట్లు ధృవీకరించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 6 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇందులో విపత్తు నిర్వహణ శాఖ నుండి రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2 లక్షలు అందజేయనున్నారు. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Ranga Reddy Crime: తెలంగాణలో ఘోరం.. భార్య, కొడుకుని.. దారుణంగా చంపిన కిరాతకుడు!