Weapons Theft: దేశానికి సంబంధించి కీలకమైన ఆర్మీ స్థావరం. అత్యంత భద్రత మధ్య ఉండాల్సిన ఆయుధాల నిల్వ కేంద్రం. కానీ అక్కడే 12 ఆయుధాలు, మ్యాగజైన్లు, భారీగా మందుగుండు సామగ్రి మాయమయ్యాయ్. ఆగస్టు 30న చివరిసారిగా ఆయుధాల లెక్క తేలగా.. 31న తాళాలు, బాక్సులు పగిలి ఉండటంతో చోరీ బయటపడింది. అయితే ఈ చోరీపై దర్యాప్తు జరుగుతుండగానే మద్రాస్ రెజిమెంట్ ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ఓ ప్లాస్టిక్ బకెట్లో 160 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు బయటపడటం మరో ట్విస్ట్. ఎనిమిది బండిల్స్గా ఉన్న వాటిని బాంబ్ డిస్పోజల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. పోలీసుల ప్రాథమిక అంచనా మాత్రం.. ఇవి ఆర్మీకి చెందినవి కావని, సమీపంలోని ప్రైవేట్ వెంచర్లో డెవలపర్లకు సంబంధించినవై ఉండొచ్చని అన్నారు. అయినా అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయ్. కంటోన్మెంట్ పరిసరాల్లోకి ఇలాంటి పేలుడు సామగ్రి ఎలా వచ్చింది..? ఎవరు పెట్టారు..? ఎప్పుడు పెట్టారు..? ఆయుధాల చోరీతో దీనికి ఏమైనా లింక్ ఉందా..? ఇప్పటికే మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా దర్యాప్తులోకి వచ్చింది. ఆయుధాల చోరీలో లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. వెపన్స్ పట్టుకోవడమే ఇప్పుడు అసలైన సవాల్. ఇలాంటి నిర్లక్ష్యం మరోసారి లేకుండా చూసుకోవడం కూడా కీలకంగా మారింది.