Delhi News: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగనున్నాయి. అధికార ఎన్డీయే-విపక్ష ఇండియా కూటమి నేతలు తమ తమ అస్త్రాలను సిద్ధం చేశారు. కీలక బిల్లులు ఆమోదించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్లాన్ చేస్తుండగా, పాలక పక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు హాట్ హాట్గా జరగడం ఖాయమని అంటున్నారు.
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు కొనసాగనున్నాయి. సెలవులు మినహాయిస్తే కేవలం రెండువారాలు మాత్రమే సమావేశాలు జరగనున్నాయి. సభ ముందుకు అణుశక్తి బిల్లు-2025, విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు-2025 సహా 14 కీలక బిల్లులు తీసుకురావాలని మోదీ సర్కార్ భావించింది. నాలుగు ఆర్థిక సవరణ బిల్లులు, కాలం చెల్లిన 120 చట్టాలను రద్దు చేసేందుకు మరో కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
బీహార్లో విజయంతో దూకుడు మీదుంది ఎన్డీయే కూటమి. మోదీ సర్కార్ని ఇరుకున పెట్టేందుకు కీలక అస్త్రాలను రెడీ చేశాయి విపక్షాలు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ-సర్, ఢిల్లీ పేలుళ్లు, కార్మికుల కోడ్ వంటి వ్యవహారాలపై నిలదీయనుంది. అణుశక్తి రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతించే అణుశక్తి బిల్లు-2025, ఉన్నత విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి, కేంద్ర విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా రూపొందించిన విద్యా కమిషన్ బిల్లు-2025 ఇందులో కీలకమైనవి.
14 కీలక బిల్లులు.. విపక్షాల చూపంతా అటువైపే
ఆదివారం ఢిల్లీలో అఖిలపక్షం భేటీ జరిగింది. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో 36 రాజకీయ పార్టీలకు చెందిన 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ తర్వాత మీడియా మాట్లాడిన కేంద్రమంత్రి రిజిజు.. సర్పై చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ పై బీఏసీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమాఖ్య అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అదే సమయంలో రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్లో ఉంచడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా సవరణలపై ఆందోళనలను లేవనెత్తాలని ప్రతిపక్షం యోచిస్తోంది.
ALSO READ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం సాయంత్రం సోనియాగాంధీ నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏయే అంశాలపై నిలదీయాలనే దానిపై వ్యూహాన్ని సిద్ధం చేశారు. అటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చాంబర్లో సోమవారం కూటమి ప్రతినిధులు సమావేశం కానున్నారు. సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు..
సభ ముందుకు అణుశక్తి బిల్లు 2025, విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025 సహా 14 కీలక బిల్లులు
డిసెంబర్ 19 వరకూ కొనసాగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు
SIR, ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత,
కార్మిక కోడ్ ల పైనా చర్చించాలని డిమాండ్… pic.twitter.com/TeDaAzjJx9— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2025