PM Modi: దేశ పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ ముఠాలను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ ముఠా ఆటకట్టించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చామని తెలిపారు. యాంటీ పేపర్ లీక్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. ఆ తర్వాత ఆయన ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని ఇన్స్టా ద్వారా విడుదల చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ మరొక వీడియో రిలీజ్- యాంటీ పేపర్ లీక్ బిల్లు-2026 పార్లమెంటు ఉభయసభల్లో గురువారం ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాల నిడివి గల వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయన్న ప్రధాని, విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడేవారిని ఉపేక్షించేది లేదన్నారు.
లీకు ముఠాను వదిలిపెట్టబోం-ప్రధాని-విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల సూచనలను పరిగణనలోకి తీసుకోవడం వంటివి చేస్తున్నామని వివరించారు. కొన్ని దశాబ్దాలుగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ లీక్ల సమస్యతో సతమతమవుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
యాంటీ పేపర్ లీక్ బిల్లు పార్లమెంటులో ఆమోదం –సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేపర్ మాఫియా, పేపర్ లీక్ ముఠాలు, దేశ పిల్లల భవిష్యత్తును దెబ్బతీసే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అందుకు కఠినమైన చట్టాలు అవసరమన్నారు. నేను మీకు వాగ్దానం చేసినట్లుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం జరిగిందన్నారు.
ఓ అడుగు పడిందన్న ప్రధాని-విశ్వసనీయమైన పరీక్షా విధానం దిశగా ముఖ్యమైన అడుగు పడిందన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు కొనసాగనివ్వబోమన్నారు. విశ్వాసంతో, అభివృద్ధి చెందిన భారతదేశమనే కలను సాకారం చేసుకోవడానికి మనమందరం భుజం భుజం కలిపి కలిసికట్టుగా పని చేద్దామని ముగించారు.
కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులో పరీక్షలలో పేపర్ లీక్లు లేదా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు కనీసం ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడనుంది. అలాగే రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. తీవ్రతను బట్టి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్లకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ప్రశ్నా పత్రాల లీకేజీకి సంబంధించిన నేరాలను విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా నియమించే అధికారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు-కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం కల్పించింది. ఛార్జిషీట్ దాఖలు చేసిన తేదీ నుండి మూడు నెలలలోపు విచారణలను పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది.
Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf
— Narendra Modi (@narendramodi) July 30, 2026