Modi: ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో పన్నుచెల్లింపుదారుల డబ్బును అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించి వృథా చేశారని ఆరోపించారు.
షార్ట్కట్ రాజకీయాలతో అధికారం కోసం తపించడం తగదని మోదీ అన్నారు. పన్నుచెల్లింపుదారుల సొమ్ము దోపిడీ చేస్తూ నకిలీ హామీలతో అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. షార్ట్కట్ రాజకీయాల ద్వారా దేశం అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. అలాంటి రాజకీయ పార్టీలు, నేతలకు ప్రజలే బుద్ధిచెప్పాలని సూచించారు. రాజకీయ పార్టీలు షార్ట్కట్ రాజకీయాలకు బదులుగా సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా ఎన్నికల్లో విజయం సాధించవచ్చని మోదీ అన్నారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో రూ.75 వేల కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు. అన్ని రాష్ట్రాల ఐక్యత, అభివృద్ధి ద్వారానే దేశంలో ప్రగతి సాకారమవుతుందన్నారు. సంకుచిత దృక్పథంతో ఉంటే అవకాశాల పరిమితంగానే ఉంటాయన్నారు. గత ఎనిమిదేళ్లుగా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో ముందుకెళుతున్నామని తెలిపారు. అభివృద్ధిపై గతంలో ఉన్న మైండ్ సెట్నే మార్చేశామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.