PM Narendra Modi: లోక్సభలో ఫిబ్రవరి 4న అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న క్రమంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి సమాధానం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించి, సభను వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల కారణంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని ప్రసంగం ప్రారంభం కాకముందే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్కు చెందిన మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే ట్రెజరీ బెంచీల వైపు దూసుకెళ్లి, ఆయనను చుట్టుముట్టే ప్రయత్నం (ఘెరావ్) చేయడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్షాలు సృష్టించిన ఈ రభసతో ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించలేకపోయారు. అయితే, ఈ నిరసన కేవలం నినాదాలకే పరిమితం కాలేదని, సభలోనే ప్రధాని మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని లోక్సభ వర్గాలు పేర్కొనడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ముందస్తు సమాచారంతోనే భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధానిని తన సీటు వద్దకు వెళ్లనివ్వకుండా విపక్షాలు అడ్డుకున్నాయని, ఇది పార్లమెంటరీ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమని అధికార పక్ష వర్గాలు ఆరోపించాయి. అయితే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అందుకే తాము నిరసన తెలపాల్సి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు సమర్థించుకున్నాయి.
ఈ వివాదానికి ప్రధానంగా మాజీ సైన్యాధిపతి ఎం.ఎం. నరవణే రాసిన అప్రచురిత పుస్తకంలోని అంశాలు కేంద్రబిందువుగా మారాయి. లడఖ్ సరిహద్దు ఉద్రిక్తతలపై ఆ పుస్తకంలో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి తోడు, అంతకుముందు రోజు అనుచిత ప్రవర్తన కారణంగా ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం కూడా నిప్పుకు ఆజ్యం పోసింది. ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయాలని, కీలక అంశాలపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పట్టుబట్టాయి.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, లోక్సభలో తన గళాన్ని వినిపించలేకపోయిన ప్రధాని మోదీ, నేడు (ఫిబ్రవరి 5) రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై ప్రసంగించనున్నారు. ఈ సంఘటనపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. విపక్షాల తీరును “ప్రజాస్వామ్య హననం”గా బీజేపీ అభివర్ణించగా, “ప్రధాని సభలో వాస్తవాలను ఎదుర్కోవడానికి భయపడి పారిపోతున్నారు” అని రాహుల్ గాంధీ విమర్శించారు.
Read Also: తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వారాల గడువు