Yadadri Forest Alert: గత రెండు వారాలుగా సిద్దిపేట-యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. జాతీయ పులుల సంరక్షణ సంస్థ ( ఎన్ టి సి ఏ) మార్గదర్శకాల మేరకు పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి డాక్టర్ సీ. సువర్ణ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంను బుధవారం అరణ్య భవన్లో నిర్వహించారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించగా, పులి కదలికలపై నిరంతర సమీక్షలు చేపట్టి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో పులికి కూడా హాని జరగకుండా ట్రాకర్లు, అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కెమెరా ట్రాప్ల ద్వారా లభించిన సమాచారం ప్రకారం ఈ పులి మగ పులిగా నిర్ధారణ అయిందని, మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ పులి, కావల్ టైగర్ రిజర్వ్తో పాటు పలు జిల్లాల మీదుగా సంచరిస్తూ ప్రస్తుత ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. పులి కదలికలను ఖచ్చితంగా తెలుసుకునేందుకు కెమెరా ట్రాప్లు, థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు.
Also Read: Karimnagar Municipality: శర్మ నగర్లో దారి వివాదం.. కుట్ర కోణంపై అనుమానాలు
ఈ క్రమంలో ఇసాయిపేట, చిన్న లక్ష్మీపురం సమీప ప్రాంతాల్లో పులి కనిపించినట్లు ట్రాకింగ్ బృందాలు వెల్లడించాయి.ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ సభ్యురాలు హరిణి వేణుగోపాల్, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు రమేష్, హైటికోస్ (హైదరాబాద్ కన్సర్వేషన్ సొసైటీ) సభ్యుడు ఇమ్రాన్ సిద్దిక్, పుణెకు చెందిన రెస్క్యూ బృందం నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ నిపుణులు అటవీ శాఖకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తున్నారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ వినయ్ కుమార్, సీసీఎఫ్ క్షితిజ, వైల్డ్లైఫ్ ఓఎస్డీ శంకరన్, వైల్డ్లైఫ్ డీసీఎఫ్ ఆంజనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Dhurandhar: మొత్తం 7 దేశాల్లో సత్తా చాటుతున్న ధురంధర్.. ఆ రికార్డ్స్ అన్నీ మాయం!