andaman and nicobar islands:అండమాన్ నికోబార్ లో ఇన్నాళ్లు పేర్లు లేని దీవులకు.. పరాక్రమ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్లు పెట్టారు. 21 దీవులకు 21 మంది పరమ్ వీర్ చక్ర గ్రహీతల పేర్లను నామకరణం చేశారు. దాంతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్ధం జాతీయ స్మారకం నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు.
మొదటిసారి త్రివర్ణపతాకం ఈ అండమాన్ గడ్డ మీదే రెపరెపలాడింది… స్వతంత్ర భారత్కు చెందిన ప్రభుత్వం మొదట ఇక్కడే ఏర్పాటైంది. ఈ 21 మందికి దేశమే అన్నింటికంటే ముఖ్యం. దీవులకు అమరవీరుల పేర్లను పెట్టడం ద్వారా వారి తీర్మానం ఎప్పటికీ నిలిచి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. అండమాన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
అండమాన్ దీవుల్లో అన్నింటి కంటే పెద్ద దీవికి మొదటి పరమ్ వీర్ చక్ర గ్రహీత మేజర్ సోమ్నాథ్ శర్మ పేరును నామకరణం చేశారు. ఇలా మొత్తం 21 దీవులకు పేర్లు పెట్టారు. ‘నిజ జీవిత హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రధాని అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. దానికి అనుగుణంగానే పేర్లు లేని 21 దీవులకు పరమ్ వీర్ చక్ర గ్రహీతల పేర్లు పెట్టాలని నిర్ణయించారని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఏటా జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకొని, పరాక్రమ్ దివస్గా నిర్వహిస్తూ నివాళులర్పిస్తోన్న కేంద్ర ప్రభుత్వం… ఈ సారి అండమాన్, నికోబార్ లలోని పేరు లేని అతిపెద్ద దీవులకు పేర్లు పెట్టేందుకు సంకల్పించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం.. అండమాన్ – నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి 2018లో ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా రాస్ ఐలాండ్స్ కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని నామకరణం చేశారు. అక్కడ ఇప్పుడు జాతీయ స్మారకాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే నీల్ ఐలాండ్, హేవ్లాక్ ఐలాండ్కు షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్గా పేరు మార్చారు.