Prashanth Kishore: ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థాపించిన ‘జన్ సురాజ్ పార్టీ’ ఘోర పరాజయం పాలవడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) తొలిసారిగా స్పందించారు. ఈ ఎన్నికల్లో పార్టీకి కనీసం 4 శాతం ఓట్లు కూడా రాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే పెద్ద పొరపాటని ఆయన అంగీకరించారు.
ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, “నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం ఒక తప్పుగా భావించవచ్చు. మా పార్టీకి 4 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే ఇంకా ఎంతో కష్టపడాల్సి ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్లోని మొత్తం 243 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ, ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం, డిపాజిట్లు కోల్పోవడం తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు.
అయితే, ఈ ఓటమితో తాను వెనకడుగు వేయబోనని పీకే స్పష్టం చేశారు. “బిహార్ను గెలవకుండా నేను వెనక్కి తగ్గేదే లేదు. ఇందుకు ఎంత సమయం పట్టినా సరే, నా పోరాటం ఆపను” అని ధీమా వ్యక్తం చేశారు. తన అంచనాలు తప్పాయని, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యామని నిజాయితీగా ఒప్పుకున్నారు. భవిష్యత్తులో మరింత పగడ్బందీగా వ్యూహాలు రచిస్తామని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, నవంబర్ 2025లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించగా, జన్ సురాజ్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ‘జన్ సురాజ్ పార్టీ’ బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది.
Read Also: Sleep Hours: రోజూ 5 గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీరు సూపర్ హీరోలే, ఎందుకంటే?