Prashant Kishore: బీహార్ ఓటర్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు షాకిచ్చారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ) అసెంబ్లీ ఎన్నికల్లో అంత ప్రభావం చూపలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సైలెంట్ గా బరిలోకి వచ్చిన పీకే.. ఫలితాల్లోనూ సైలెంట్ అయింది. ప్రారంభ ట్రెండ్ లో రెండు చోట్ల కాస్త ముందంజలోకి వచ్చినా ఆ తర్వాత చతికిలపడింది.
సుపరిపాలన హామీతో ఎన్నికల ముందు పార్టీ పెట్టిన ప్రశాంత్ కిశోర్.. బీహార్ ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. అయితే జేఎస్పీ ఓట్ల చీలికలో కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే 200కి పైగా స్థానాల్లో పీకే పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. దేశ వ్యాప్తంగా అనేక రాజకీయాలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. ఆయా పార్టీలు అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు. అయితే సొంత రాష్ట్రం బీహార్ మాత్రం పీకే చతికిలపడ్డారు. ఈసారి నితీష్ కుమార్ కూటమి ఘోరంగా ఓడిపోతారని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు. తీరా ఫలితాలు వచ్చేసరికి సీన్ సివర్స్ అయింది.
బీహార్ ఎన్నికల్లో పీకే జేఎస్పీ ఖాతా తెరవలేకపోయింది. ప్రస్తుతం పోటీ చేసిన అన్ని స్థానాల్లో జన్ సురాజ్ పార్టీ వెనుకంజలో కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా జేఎస్పీ ప్రభావం చూపలేకపోయింది.
జేఎస్పీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్.. దేశంలో అనేక రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు. బెంగాల్, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో స్థానిక పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. కింగ్ మేకర్ గా పీకేకు పేరు ఉన్నప్పటికీ, రాజకీయ నేతగా ఎదిగేందుకు ఇంకా సమయం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (2020) ప్రశాంత్ కిశోర్ పోటీ చేయలేదు. కానీ పలు పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. తెరవెనుక కీలకంగా పనిచేశారు. పొత్తులు, సందేశాలు, ప్రచార వ్యూహాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేశారు. ఎలాంటి పొత్తుల్లేకుండా ఎన్నికల బరిలో దిగిన జేఎస్పీ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.
Also Read: Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాలు.. కీలక నేతల పరిస్థితి ఇదీ
పీకే జేఎస్పీ విజయం సాధించనప్పటికీ మహాఘట్ బంధన్ ఓట్లను చీలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ అంత ప్రభావం చూపలేకపోయిందని స్పష్టమైంది. వ్యూహరచన చేసినంత ఈజీ కాదు ప్రత్యక్ష రాజకీయాలు అనేది మరోసారి రుజువైందని విశ్లేషకులు అంటున్నారు.