Rahul Gandhi: సభలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని, భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా విపక్ష నేతకు (LOP) రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేస్తూ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకే విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల రూపాయలతో కృత్రిమంగా నిర్మించిన ప్రధాని మోదీ ఇమేజ్ అనే బుడగ ఇప్పుడు బద్దలయ్యే సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
భారత చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరో వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం ‘కాంప్రమైజ్’ అయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనివల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతినడమే కాకుండా, ముఖ్యంగా రైతులకు మరియు సామాన్య ప్రజలకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదని, అది నేరుగా ప్రధాని మోదీ ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుందని విశ్లేషించారు. అలాగే ‘ఎప్స్టైన్ ఫైల్స్’ (Epstein Files)లో దాగిన రహస్యాలు ప్రధానిపై ఉన్న ప్రధాన ‘ప్రెషర్ పాయింట్స్’ అని, అందుకే ఆయన ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.
గత నాలుగు నెలలుగా ఆగిపోయిన ఒక కీలక ట్రేడ్ డీల్పై ప్రధాని నిన్న రాత్రి హడావిడిగా సంతకం చేయడం వెనుక విదేశీ ఒత్తిళ్లు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేవలం కొందరి ప్రయోజనాల కోసం దేశాన్ని, రైతుల రక్తాన్ని ప్రధాని అమ్మేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శకతను కోల్పోయారని, దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.
Read Also: అంగట్లో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది.. నువ్వు మాట్లాడుతున్నవా కేటీఆర్, బల్మూరి వెంకట్ ఫైర్