బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడటం అంటే.. చంపిన వ్యక్తే మళ్ళీ వచ్చి సంతాపం తెలిపినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను కనీసం కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని కేటీఆర్, ఇప్పుడు వారి కోసం పోరాడుతున్నట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. పదో తరగతి పరీక్షల నుంచి గ్రూప్-1 వరకు ప్రతి నోటిఫికేషన్లోనూ పేపర్ లీకేజీలు జరిగాయని, ఉద్యోగాలను అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నారని మండిపడ్డారు. లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని పదేపదే అబద్ధాలు చెబుతున్న కేటీఆర్, అసలు ఏ నిరుద్యోగికి న్యాయం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు మీ చేసిన మోసాన్ని గమనించే, నిరుద్యోగులు మిమ్మల్ని ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.
ప్రస్తుత ప్రజా ప్రభుత్వ హయాంలోనే నిరుద్యోగులకు నిజమైన న్యాయం జరుగుతోందని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందజేశామని వివరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. ఇందుకోసం TGPSC ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని, అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు వెలువడతాయని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ భారీ నియామక ప్రక్రియను జీర్ణించుకోలేకనే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల కుట్రలను, అబద్ధపు ప్రచారాలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.