Warangal: వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై గళం ఎత్తుతూ మే 6వ తేదీన భారీ ఎత్తున ‘రైతు సదస్సు’ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, ఈ సదస్సును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వ స్థలాల్లో సదస్సు నిర్వహించుకోకుండా అనుమతులు నిరాకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వరంగల్ జిల్లా నుండి ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, వారు రైతుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం తమ ఇళ్లకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారికి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీరుపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. వరంగల్ జిల్లాలోని మంత్రులను డమ్మీలుగా మార్చి, పొంగులేటికే పెత్తనం అప్పగించారని విమర్శించారు. జిల్లాలో అటెండర్ నుండి కలెక్టర్ వరకు అందరూ పొంగులేటి మాటకే ప్రాధాన్యత ఇస్తున్నారని, స్థానిక మంత్రులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అన్నారు. పొంగులేటి ఎప్పుడూ కాంట్రాక్ట్ పనులపై రివ్యూలు చేస్తారు తప్ప, రైతుల సంక్షేమం కోసం ఒక్క రివ్యూ కూడా చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు.
ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన ‘రైతు డిక్లరేషన్’ హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేస్తామని, అందులో భాగంగానే ఈ రైతు సదస్సు నిర్వహిస్తున్నామని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read: ప్రపంచంలోనే ఖరీదైన మామిడి.. మన దగ్గరకొచ్చింది.. కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!