Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్ అదానీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమెరికా న్యాయశాఖ (DOJ) అదానీ గ్రూపుపై మోసం , లంచం ఆరోపణలతో అభియోగాలు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్స్టీన్ ఫైళ్లు , ఇతర ప్రముఖుల పేర్ల ప్రస్తావన తెరపైకి వచ్చింది.
అమెరికాలో అదానీకి వ్యతిరేకంగా నమోదైన కేసుపై గత 18 నెలలుగా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా కోర్టుల్లో ఆధారాలు ఉన్నప్పటికీ.. భారత్లో ఆయనను అరెస్టు చేయకపోవడం వెనుక ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అదానీని రక్షిస్తున్నారని.. అదానీ స్వేచ్ఛగా తిరగడం వెనుక ఉన్న ఏకైక కారణం ప్రధాని ఒత్తిడి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ వివాదంలో జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ఫైళ్లలో భారతీయ ప్రముఖుల పేర్లు ఉన్నాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అందులో హర్దీప్ సింగ్ పూరి, అనిల్ అంబానీ వంటి పేర్లు ఉన్నాయని సోషల్ మీడియాలో, కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల వద్ద ఉందని.. ప్రభుత్వం వీటిపై మౌనం వహించడం ద్వారా తమ సన్నిహితులను కాపాడుకోవాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుతం అదానీపై అమెరికాలో వారెంట్ జారీ అయిన నేపథ్యంలో.. సెబీ (SEBI) దర్యాప్తు తీరుపై కూడా రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతింటోందని.. తక్షణమే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: హైదరాబాద్లో డ్రగ్స్ వేట.. రూ. 35 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఒడిశా ముఠా అరెస్ట్!