Hyderabad Drugs: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు సాగిస్తున్న తనిఖీల్లో భాగంగా మరో భారీ గంజాయి ముఠా గుట్టు రట్టయింది. నగర కమిషనర్ టాస్క్ ఫోర్స్ , ఎస్.ఆర్. నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో సుమారు ఏకంగా రూ. 35 లక్షల విలువైన 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. అరెస్ట్ అయిన వారిలో మనీల్ దలబెహరా, ఇస్మాయిల్ ప్రధాన నిందితులు. మనీల్ ఒడిశాలో స్వయంగా గంజాయి సాగు చేసే రైతు కాగా.. ఇస్మాయిల్ గంజాయి విక్రేతగా వ్యవహరిస్తున్నాడు. ఇస్మాయిల్ ప్రస్తుతం మేడ్చల్ ప్రాంతంలో నివసిస్తూ ఒక ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే.. కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో మనీల్ సహాయంతో ఒడిశా నుండి గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నాడు.
వీరు ఒడిశా నుండి సేకరించిన ఎండు గంజాయిని హైదరాబాద్లోని ధూల్పేట వంటి ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు , ఇతర చిన్న వ్యాపారులకు రహస్యంగా విక్రయిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 70 కిలోల గంజాయితో పాటు.. నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు యువతకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో లేదా చెడు వ్యసనాలకు లోనై డ్రగ్స్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. హైదరాబాద్ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చడంలో ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ నుంచి ఓటుకు నోటు వరకు.. FSL అగ్నిప్రమాదం వెనుక ఉన్న మతలబు ఇదేనా?