Rahul Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్గాంధీ. ఓట్ల చోరీ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఎన్నికల అవకతవకలు బీజేపీకి సీట్లు గెలవడానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి సహాయ పడ్డాయని ఆరోపించారు.
రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్
ఓట్ల దొంగతనం కొన్నిసార్లు సీట్లు, మరికొన్నిసార్లు ప్రభుత్వాలనే దొంగలిస్తుందని మండిపడ్డారు. లోక్సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో సుమారుగా ఆరుగురిలో ఒకరు ఓట్ల దొంగతనం ద్వారా గెలిచారని కుండబద్దలు కొట్టేశారు. వారిని గుర్తించడం కష్టమేమీ కాదని, బీజేపీ పరిభాషలో వారిని చొరబాటుదారులు అని పిలవాలా? అని ప్రశ్నించారు.
హర్యానా విషయానికొస్తే? అక్కడ ప్రభుత్వమే చొరబాటుదారుల ప్రభుత్వమని ఆరోపించారు. సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకునేవారు ఓటర్ల జాబితాలను, ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసేవారు వారే స్వయంగా రిమోట్ కంట్రోల్లో ఉంటారని అన్నారు. వారి అసలు భయం సత్యమేనని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే ఇవాళ 140 సీట్లు కూడా ఆ పార్టీ గెలుచుకునేది కాదన్నారు.
బీజేపీపై తీవ్రస్థాయిలో రాహుల్ మండిపాటు
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ భారీ మెజారిటీలతో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వెల్లడైన రెండు రోజుల తర్వాత ప్రతిపక్షాలు ఎన్నికల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న గుప్పించడంపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకుంటున్న సంస్థలు కేంద్రం నియంత్రణలో ఉన్నాయని ఆయన ప్రధాన ఆరోపణ.
సోమవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ అస్సాం, బెంగాల్ ల్లో ఎన్నికలు దొంగిలించబడ్డాయనడానికి స్పష్టమైన ఉదాహరణలని ప్రధానంగా విమర్శించారు. బెంగాల్ మాజీ సీఎం మమత మాటలతో ఏకీభవిస్తున్నామని అన్నారు. బెంగాల్లో 100కు పైగా సీట్లను బీజేపీ దొంగిలించారని మమత మంగళవారం ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో ఇలాంటి పోకడలే కనిపించాయంటూ కాంగ్రెస్ నేతలు మాటల వేడి పెంచారు.
ALSO READ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు