Rahul Gandhi: ప్రస్తుతం భారతదేశంలో శాంతియుత నిరసన తెలపడం అతిపెద్ద నేరంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారత్.. నేడు భిన్నాభిప్రాయాలను రాజద్రోహంగా భావించే దిశగా వెళ్తోందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంపై ప్రశ్నలు అడిగితే లాఠీఛార్జ్.. ప్రాసిక్యూషన్.. జైలు శిక్షలు ఖాయమనే వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దుయ్యబట్టారు.
వివిధ వర్గాల ఆందోళనలను ప్రభుత్వం అణచివేస్తున్న తీరును రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఎండగట్టారు. పేపర్ లీక్తో భవిష్యత్తు అంధకారమైన యువత తమ హక్కుల కోసం పోరాడితే లాఠీలతో సమాధానం చెబుతున్నారని విమర్శించారు. దేశానికి గర్వకారణమైన మహిళా రెజ్లర్లు బీజేపీ నేతపై ఆరోపణలు చేసి నిష్పాక్షిక దర్యాప్తు కోరితే వారిని అప్రతిష్టపాలు చేసి వీధుల నుండి బలవంతంగా తొలగించారని గుర్తు చేశారు. అత్యాచార బాధితులకు న్యాయం కోరితే ఆ డిమాండ్ను వ్యవస్థకు అసౌకర్యంగా భావిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు “జాతి వ్యతిరేకులు”గా ముద్ర వేశారని ఆరోపించారు.
రైతులు.. గిరిజనుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును రాహుల్ తీవ్రంగా ఖండించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై టియర్ గ్యాస్.. రబ్బరు బుల్లెట్లు.. వాటర్ ఫిరంగులను ప్రయోగిస్తూ వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. నీరు.. అడవి.. భూమి కోసం నిలబడిన గిరిజనులను కూడా అనుమానంతో చూడటం నేరమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ సమస్యలపై నిలదీసే సామాన్యుల ఆందోళనలను కూడా రాజకీయాలుగా అణచివేస్తున్నారని విమర్శించారు.
“మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు” అంటూ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతియుత నిరసన అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ అని.. ప్రశ్నలు అడగడం బలహీనత కాదు అది ప్రజాస్వామ్య బలం అని స్పష్టం చేశారు. విమర్శలను విని ప్రభుత్వం జవాబుదారీగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని హితవు పలికారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశానికే శత్రువులుగా పరిగణించే ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని ఆయన హెచ్చరించారు.