PCC Internal Report: కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేలు, మొదటి సారి శాసనసభ్యులుగా ఎన్నికైన వారిపై సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా?… అంటే ఔననే అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక కొందరు చతికిల పడితే.. మరి కొందరు తీవ్రంగా శ్రమించినా టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారని.. పార్టీ పెద్దలు వారిపై అసంతృప్తితో ఉన్నారంట. నియోజకవర్గంపై యువ నేతలకు ఇంకా పట్టు రావడం లేదని.. అంతా తామే అనుకోవడమే యంగ్ ఎమ్మెల్యే లకు నష్టం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ నాయకత్వాన్ని అసంతృప్తికి గురి చేస్తున్నాయట.. గెలిచే అవకాశం ఉన్నా కోల్పోయిన మున్సిపాలిటీలలో ఏం జరిగిందనే దానిపై కాంగ్రెస్ పెద్దలతో పాటు పీసీసీ ఇంటర్నల్ రిపోర్ట్ తెప్పించుకుందట.. రిజల్ట్ వచ్చిన తర్వాత తెప్పించుకున్న రిపోర్టుల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.
యంగ్ ఎమ్మెల్యే లతో పాటు కొత్తగా ఎన్నికైన సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చోట్లే ఫలితాలు అంతంత మాత్రంగా వచ్చాయని సదరు నివేదికల్లో తేలిందంట. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నా.. అక్కడ బీఆర్ఎస్, బీజేపీల కంటే తక్కువ స్థానాల్లో కాంగ్రెస్కు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది.
Also Read: Gandhi Hospital IVF: సర్కారీ ఆసుపత్రుల్లో సంతాన భరోసా.. నమ్మకంతో క్యూకడుతున్న జనం
అంతేకాదు మంత్రిగా పనిచేస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గ కేంద్రం చెన్నూరు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ మెజారిటీ వార్డులు దక్కించుకోలేకపోయింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఆమన్గల్ మునిసిపాల్టీలో కాంగ్రెస్ ఒక్క వార్డు మాత్రమే గెలుచుకోగలిగింది.. అయితే అక్కడ మ్యాజిక్ చేసి బీఆర్ఎస్ కౌన్సిలర్ని కాంగ్రెస్లోకి చేర్చుకొని మున్సిపాలిటీని దక్కించుకోగలిగింది.
అలాగే మరికొంత మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ వివిధ మున్సిపాల్టీల్లో మెజారిటీ వార్డులు దక్కించుకోలేకపోయింది.. మహబూబాబాద్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఉన్నా.. నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ దక్కించుకోలేకపోయింది. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కంటే బీ.ఆర్.ఎస్కే ఎక్కువ స్థానాలు దక్కాయి. అక్కడ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియోగా ఓటు వేసి.. లాటరీ ద్వారా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాల్సి వచ్చింది.
వర్ధన్నపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు సైతం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఆధిపత్యం సాధించలేకపోయారు.. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సాధించలేకపోయింది.. ఇక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడలో కూడా మెజారిటీ వార్డుల్లో విపక్షాలే గెలుపొందాయి.
ఇలా మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్లే ఫలితాలు తలకిందులుగా రావడంపై కాంగ్రెస్ నాయకత్వం అసంతృప్తిగా ఉందట.. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇంకా నియోజకవర్గంపై పట్టు సాధించలేదా అంటూ సదరు నేతల తీరుపై రాష్ట్ర నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసిందట.. ఇకనైనా నియోజకవర్గంపై పట్టు సాధించాలని తలంటినట్లు పార్టీలో చర్చజరుగుతుంది. చూడాలి మరి ఇక నైనా సదరు ఎమ్మెల్యేలు తమ తప్పులను సరి చేసుకొని నియోజకవర్గంపై పట్టుసాధిస్తారో? లేదో?
Also Read: Kodanda Reddy: పదవి కోసం నేను ఢిల్లీకి వెళ్లను.. నా పనితీరు సీఎం, పీసీసీలకు తెలుసు..?