Rahul Gandhi: నియోజకవర్గాల పునర్విభజన, గెర్రీమాండరింగ్ (Gerrymandering) అంశంపై రాహుల్ గాంధీ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ ఈ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
2029 ఎన్నికల్లో తమకు రాజకీయ లబ్ధి చేకూర్చేలా లోక్సభ స్థానాలను గెర్రీమాండరింగ్ చేయడమే బీజేపీ ప్రమాదకర లక్ష్యమని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లులు పునర్విభజనపై ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను తొలగిస్తున్నాయని, దీనివల్ల ప్రభుత్వం తనకు నచ్చిన వారినే డీలిమిటేషన్ కమిషన్లో నియమించుకుని, వారిని శాసించే పూర్తి అధికారాన్ని పొందుతుందని ఆయన విమర్శించారు.
అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో బీజేపీ ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలకే పాల్పడిందని ఆయన గుర్తు చేశారు. అక్కడ బీజేపీ వ్యతిరేక ప్రాంతాలను, వర్గాలను ముక్కలు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందిందని ఆరోపించారు. దీనివల్ల ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను ఆయన ఇలా వివరించారు:
కొన్ని నియోజకవర్గాల్లో 25 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరికొన్నింటిలో కేవలం 8 లక్షల మందే ఉన్నారు. కొన్ని స్థానాల్లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే, మరికొన్నింటిలో కేవలం 6 మాత్రమే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలు నదులు లేదా పర్వతాల ద్వారా విడదీయబడి, ఎటువంటి సంబంధం లేకుండా ముక్కలుగా మారిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఇతర చిన్న రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని రాహుల్ హెచ్చరించారు. వాటా దొంగతనం ద్వారా ఓబీసీ, దళిత, ఆదివాసీ వర్గాలకు అన్యాయం జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. కులగణనను విస్మరించి చేసే ఈ ప్రక్రియ రాజ్యాంగంపై దాడి అని ఆయన అభివర్ణించారు.
డీలిమిటేషన్ అనేది అన్ని వర్గాలు, రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులు జరిపి, పారదర్శకమైన విధానం ద్వారా జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. అప్పుడే ప్రతి భారతీయుడి గొంతు పార్లమెంట్లో వినబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మాదిరిగానే డీలిమిటేషన్ కమిషన్ను కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని, అయితే దీనిని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని ఆయన తన ట్వీట్లో తేల్చి చెప్పారు.
One of the BJP's dangerous plans is to “gerrymander” all Lok Sabha seats to its advantage for the 2029 elections
The proposed Bills remove all Constitutional safeguards on delimitation, giving full power to the Delimitation Commission which the govt itself will appoint and… pic.twitter.com/7iFz4GmcAH
— Rahul Gandhi (@RahulGandhi) April 15, 2026
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కనీసం కొత్త జనాభా లెక్కల ప్రక్రియ (Census) కూడా పూర్తి చేయకుండా డీలిమిటేషన్ చేపట్టడం అప్రజాస్వామికమని అన్నారు. కొత్త జనగణన జరిగిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గట్టిగా పోరాడుతామని ఖర్గే ప్రకటించారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆరోపించారు.
ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారంటూ మండిపడుతూ.. “ధైర్యముంటే నా కారును ప్రతిరోజూ చెక్ చేయండి” అని అధికారులకు సవాల్ విసిరారు. ఎన్నికల సంఘం, కేంద్ర సంస్థలను వాడుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు.
గెర్రీమాండరింగ్ అనేది రాజకీయాల్లో ఒక వివాదాస్పద వ్యూహం. ఒక రాజకీయ పార్టీ లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వం, తమకు అనుకూలమైన ఫలితాలు వచ్చేలా ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను (Boundaries) మార్చడాన్ని గెర్రీమాండరింగ్ అంటారు. ఈ పదం 1812లో అమెరికాలోని మసాచుసెట్స్ గవర్నర్ ఎల్బ్రిడ్జ్ గెర్రీ పేరు మీదుగా వచ్చింది. ఆయన తన పార్టీకి ప్రయోజనం కలిగేలా నియోజకవర్గ సరిహద్దులను మార్చారు. ఆ కొత్త మ్యాప్ చూడటానికి ఒక సాలమండర్ అనే బల్లి లాంటి జంతువు ఆకారంలో ఉంది.
Read Also: ఇష్టారీతిన డీమిలిటేషన్ చేస్తే.. ఊరుకునేదే లేదు.. కేంద్రానికి ఎంపీ చామల వార్నింగ్!