Railway Charges: భారతీయ రైల్వే.. ఇటీవల టికెట్ల రేట్లు పెంచిన విషయం తెలిసిందే. పెంచిన టికెట్ ధరలు ఇవాళ్టి నుండి అమల్లోకి వచ్చింది. ఆరు నెలల్లో రెండోసారి రైల్వేశాఖ ఛార్జీలు పెంచింది. ఇప్పటికే తమ రైలు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు డిసెంబర్ 26న లేదా ఆ తర్వాత ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు, విమాన ప్రయాణాలతో పోలిస్తే రైలు ప్రయాణం అత్యంత తక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
కొత్త రైలు ఛార్జీల ప్రకారం, నాన్-ఏసీ కోచ్లలో 500 కి.మీ వరకు ప్రయాణించే ప్రయాణికులు అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. నాన్-ఏసీ కోచ్లలో మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు కి.మీ.కు 2 పైసలు పెంచగా, ఏసీ క్లాస్ ఛార్జీలు కూడా కి.మీ.కు 2 పైసలు పెంచింది. 215 కి.మీ వరకు సబర్బన్ సర్వీసులు, సీజన్ టికెట్లు, సెకండ్ క్లాస్ ఆర్డినరీ ప్రయాణాలకు ఛార్జీల పెంచలేదు. నాన్-సబర్బన్ మార్గాలతో సహా సబర్బన్ సర్వీసులు, సీజన్ టికెట్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 215 కి.మీ వరకు ప్రయాణాలకు ఛార్జీల పెంపు లేదు.
తేజస్ రాజధాని, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హమ్సఫర్, అమృత్ భారత్, తేజస్, మహామన, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, యువ ఎక్స్ప్రెస్, జన శతాబ్ది, నమో భారత్ రాపిడ్ రైల్, ఆర్డినరీ నాన్-సబర్బన్ సర్వీసులు (AC MEMU/DEMU మినహా) ప్రధాన రైలు సర్వీసులు ప్రాథమిక ఛార్జీలను సవరించారు. రిజర్వేషన్ ఫీజులు లేదా సూపర్ఫాస్ట్ ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ తెలిపింది.
Also Read: Lucknow Flower Pots: పీఎం ప్రోగ్రామ్ అవ్వగానే.. క్షణాల్లో పూల కుండీలు మాయం.. వీడియో వైరల్
పెంచిన రేట్లు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు వర్తించవని రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, డిసెంబర్ 26, 2025న లేదా ఆ తర్వాత ప్రయాణాలకు ఎటువంటి ఛార్జీలు తేడా ఉండదని పేర్కొంది. అయితే పెంచిన ఛార్జీలను టీటీఈ జారీ చేసిన టికెట్లకు వర్తిస్తుందని తెలిపింది. ఇవాళ్టి నుంచి రైళ్లలో లేదా స్టేషన్లలో టీటీఈలు లేదా టికెట్ తనిఖీ సిబ్బంది జారీ చేసిన కొత్త టికెట్లకు పెంచిన ధరలు వసూలు చేస్తామని రైల్వేలు స్పష్టం చేశాయి. పెంచిన ఛార్జీల జాబితాలను అన్ని రైల్వే స్టేషన్లలో ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.