Lucknow Flower Pots: ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రేరణ స్థల్ ను గురువారం ప్రారంభించారు. ప్రధాని వచ్చే మార్గంలో అలంకరణకు పూల కుండీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని కార్యక్రమం ముగిసిన తర్వాత పూల కుండీలను స్థానికులు ఎత్తుకెళ్లారు. రాష్ట్ర ప్రేరణ స్థల్ ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే స్థానికులు పూల కుండీలు ఎత్తుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో బైక్ లపై వెళ్తున్న వ్యక్తులు పూల కుండీలను తీసుకెళ్తున్నట్లు కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత కక్కుర్తి ఎందుకని పలువురు విమర్శలు చేస్తున్నారు.
“బీజేపీ జెండా పట్టుకున్న ఓ వ్యక్తి స్కూటీ మీద పూల కుండీలు పట్టుకెళ్లడం మిస్ అవ్వకండి” అంటూ ఒక నెటిజన్ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు. “భారతదేశంలో ఇది అసాధారణ దృశ్యం కాదు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత అధికారులు పూల కుండీలు ఎందుకు తొలగిస్తారో తెలుసా. వాటిని దొంగిలించే వారు సాధారణంగా పేదవారు కాదు, ఆర్థికంగా మంచి కుటుంబాల నుండి వచ్చినవారు” అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా పోస్టు పెట్టారు.
In UP's Lucknow, people could be seen stealing flower pots kept on road after PM Modi's event in the city where he inaugurated the "Rastra Prerna Sthal". pic.twitter.com/4CvAFsIMvd
— Piyush Rai (@Benarasiyaa) December 26, 2025
2023లో జరిగిన G20 ఈవెంట్ తర్వాత కూడా ఇలాంటి సంఘటన జరగడంపై అప్పట్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. లక్నోలో మెర్సిడెస్ కారులో వచ్చిన వ్యక్తులు పూలకుండీలను తీసుకెళ్లారని, CCTV ఫుటేజ్ చూపించారు. G20 సమ్మిట్ కోసం నగరాన్ని అలంకరించడానికి పూల కుండీలు పెడితే.. ప్రజలు మెర్సిడెస్లో వచ్చి రోడ్డుపై ఉంచిన పూల కుండీలను తీసుకెళ్తున్న CCTV ఫుటేజ్ను తాను చూశానన్నారు. మెర్సిడెస్ కారు ధర, పూల కుండీ ధర ఎంత ఉంటుందో ఊహించుకోండని సీఎం అన్నారు. ఈ విషయంపై పూల కుండీలు పట్టుకెళ్లిన వారికి ఫోన్ చేసి వారి వీడియోలు చూపించామన్నారు. ప్రజలు బాధ్యతతో నడుచుకోవాలని కోరారు.