Live-in-Relationship Verdict: పెళ్లి వయస్సు రాకున్నా, పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇరువురి మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సహజీవనం చేస్తున్న కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) తమకు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. యువతి కుటుంబం వీరి సంబంధాన్ని వ్యతిరేకించి, చంపేస్తామని బెదిరించడంతో వారు కోర్టుకెక్కారు. కోటాలోని పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
భారతదేశంలో మహిళలకు చట్టబద్ధమైన వివాహ వయస్సు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు. కోటాకు చెందిన ఒక యువ జంట దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ, ఇద్దరి అంగీకారం మేరకు వివాహ వయస్సు రాకున్నా సహజీవనంలో ఉండవచ్చని రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. 18 సంవత్సరాలు దాటిన వారిని మేజర్లుగా గుర్తిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని కోర్టు పేర్కొంది.
కోటాకు చెందిన 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు తమను రక్షించాలని దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ జస్టిస్ అనూప్ ధండ్ ఈ తీర్పు ఇచ్చారు. పరస్పర అంగీకారం ద్వారా తాము సహజీవనం చేస్తున్నామని కోర్టుకు తెలిపింది యువ జంట. తమకు ప్రాణహాని ఉందని పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ జంట అక్టోబర్ 27, 2025న లివ్-ఇన్ రిలేషన్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కోర్టుకు తెలిపింది.
Also Read: Sabarimala: శబరిమలలో మళ్లీ రచ్చ.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి, రంగంలోకి పోలీసులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. యువకుడికి 21 ఏళ్లు పూర్తి కాకపోవడంతో అతడు చట్టబద్ధంగా వివాహం చేసుకోలేడని, లివ్-ఇన్ పార్టనర్షిప్లో ఉండటానికి అనుమతించకూడదని వాదించారు. అయితే ఈ పిటిషన్ పై తీర్పు ఇస్తూ… చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తెలిపారు.