Supreme Court On Stray Dogs: వీధి కుక్కల వ్యవహారం రోజు రోజుకూ జఠిలమవుతోంది. ఎక్కడో దగ్గర దాడులు చేస్తూనే ఉన్నాయి. వీటి బారినపడిన బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానాలు వేస్తామని ఘాటుగా హెచ్చరించింది.
వీధి కుక్కల వ్యవహారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మైదానాలు, ఇతర ప్రదేశాల్లో వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ కంటిన్యూ అవుతోంది.
ఈ నేపథ్యంలో వీధి కుక్కల అంశంపై మంగళవారం విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ముగ్గురు సభ్యులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వీటి బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వాలపై జరిమానాలు తప్పవని తేల్చి చెప్పింది.
అందుకు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత
ప్రతి కుక్క కాటు పరిహారం తప్పదని స్పష్టంచేసింది. కుక్క కాటు అనేది బాధిత వ్యక్తిపై లైఫ్ లాంగ్ ఉంటుందని పేర్కొంది. అంతేకాదు వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నవారిపై అసహనం వ్యక్తం చేసింది న్యాయస్థానం. కుక్కల దాడిలో చిన్నారులు మరణిస్తే ఎవరిని బాధ్యుల్ని చేయాలని సూటిగా ప్రశ్నలు లేవనెత్తింది.
వాటికి అన్నం పెట్టిన సదరు సంస్థ బాధ్యత వహిస్తుందా? ఈ బెడదను నివారించేందుకు రాష్ట్రాలు ఎలాంటి చర్యలు చేపట్టాయి? లేకుంటే ప్రతి కుక్క కాటు, దాడి మరణానికి ఆయా రాష్ట్రాలు భారీ పరిహారాలను చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎట్ ద సేమ్ టైమ్.. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ALSO READ: భారత్-జర్మనీ మధ్య సంబంధాలు.. డిఫెన్స్ సెక్టర్కి బూస్ట్
శునకాలపై అంత ప్రేముంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి అంటూ సూచన చేసింది. వీధి కుక్కల సమస్య భావోద్వేగ భరితమని, కేవలం కుక్కలపై మాత్రమేనా? మేము మనుషుల గురించి ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది.
వీధి కుక్కల దాడి, మరణాలకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ప్రస్తావించింంది. కుక్క కాటుకు గురై చనిపోయినవారికి ఆయా ప్రభుత్వాలే భారీ పరిహారం ఇవ్వాలని తేల్చి చెప్పింది. 1950 నుండి పార్లమెంటు ఈ అంశాన్ని పరిశీలిస్తోందని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా ఈ సమస్య వెయ్యి రెట్లకు పెరిగినట్టు ప్రస్తావించింది.