Delhi Assembly Security Breach: దేశ రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఉదయం తీవ్ర భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఒక వాహనం అసెంబ్లీ ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అసెంబ్లీ సమావేశాలు.. కీలక కార్యక్రమాలు జరిగే సమయంలో ఇలాంటి ఘటన జరగడం భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు.. అసెంబ్లీ భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తమయ్యారు.
అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ (UP) రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఒక తెల్లటి కారు అతివేగంగా అసెంబ్లీ గేటు నంబర్ 2 వద్దకు చేరుకుంది. సెక్యూరిటీ సిబ్బంది ఆపే లోపే, ఆ వాహనం అక్కడి ఇనుప గేటును బలంగా ఢీకొట్టి, దానిని పగలగొట్టి లోపలికి ప్రవేశించింది. లోపలికి వెళ్లిన తర్వాత డ్రైవర్ అక్కడే ఒక పూలగుత్తిని ఉంచి, పోలీసులు తేరుకునే లోపే అదే వేగంతో వాహనాన్ని వెనక్కి తిప్పి బయటకు వెళ్లిపోయాడు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
అయితే పోలీసులు అప్రమత్తమై తేరుకునే వాహనాన్ని అడ్డుకునే లోపే అది అక్కడి నుండి మాయమైంది. వెంటనే ఢిల్లీ పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ వాహనం ఏ మార్గంలో వచ్చింది, ఏ వైపుకు వెళ్ళింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కారు యజమానిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అసలు ఆ వ్యక్తి పూలగుత్తిని అక్కడ ఎందుకు ఉంచాడు? అది ఏదైనా నిరసన వ్యక్తంచేసే పద్ధతా లేక ఏదైనా కుట్రలో భాగమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. లోపలికి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. అదనపు బలగాలను మోహరించి, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలో పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన వంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో, అసెంబ్లీ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఇలాంటి పొరపాట్లు జరగడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: డ్యూటీలో ఉండి ఆ సీన్లు.. కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఏఎస్ఐ