Central Govt: దేశ పాలనా వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలుగా ఉన్న రాజ్భవన్ల పేరును ఇకపై లోక్ భవన్ గా మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, అత్యంత కీలకమైన ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో – ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్) పేరును సేవాతీర్థ్ గా మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు పాలనా వ్యవస్థలో సామాన్య ప్రజల భాగస్వామ్యం, సేవా దృక్పథం మరింత పెంపొందించే లక్ష్యంతో తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. రాజ్భవన్ పేరును లోక్ భవన్ గా మార్చడం ద్వారా, గవర్నర్ల నివాసాలు ప్రజలకు మరింత చేరువగా.. ప్రజాహిత కార్యక్రమాలకు కేంద్రంగా మారాలనే ఆశయంతో ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్ (పాలన/అధికారం) అనే పదం కన్నా లోక్ (ప్రజలు) అనే పదం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.
మరోవైపు.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రంగా ఉన్న పీఎంవో పేరును సేవాతీర్థ్ గా మార్చడం వెనుక ప్రధాన ఉద్దేశం, ప్రధానమంత్రి కార్యాలయం కేవలం పాలనా కేంద్రంగా కాకుండా.. దేశ ప్రజలకు సేవ చేసే పవిత్ర స్థలంగా నిలబడాలనే నిబద్ధతను చాటడమే. ఈ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. పాలనా సంస్కరణల్లో భాగంగా ఈ మార్పులు కీలకమని అధికార పక్షం వాదిస్తోంది. ఈ మార్పులు దేశవ్యాప్తంగా పాలనా పదజాలంలో ఒక కొత్త శకానికి దారితీయనున్నాయి.
ALSO READ: Rammohan Reddy: ఆ బీఆర్ఎస్ మాజీ మంత్రి చేతిలో బీజేపీ రిమోట్ కంట్రోల్: సామ రామ్మోహన్ రెడ్డి