Rammohan Reddy: రాష్ట్ర బీజేపీ వ్యవహారాలపై కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రిమోట్ కంట్రోల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. ఈ సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేగింది. సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ కీలు బొమ్మల్లా మారిపోయారు. పార్టీ నిర్ణయాలు, వ్యూహాలు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్ర నాయకుడి ఆదేశాల మేరకు జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఈ పరిణామం బీజేపీ స్వతంత్రతను దెబ్బతీసిందనటంలో సందేహం లేదన్నారు.
బీజేపీ నాయకత్వంపై సామ రామ్మోహన్ రెడ్డి మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కార్యక్రమాలను పార్టీలో కొంతమంది నేతలు, కేటీఆర్ కార్యక్రమాల కంటే ఎక్కువగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. ఇది బీజేపీ రాష్ట్ర యూనిట్లో జరుగుతున్న అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు.
ప్రస్తుత రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకత్వం ఈటల రాజేందర్, హరీష్ రావు సంయుక్త వ్యూహంలో చిక్కుకుందని సామ రామ్మోహన్ ఆరోపించారు. ఈ కుట్ర కారణంగానే.. బీజేపీ అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపడంలో పార్టీ నిస్సత్తువగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు వెంటనే ఈ పరిస్థితిని సరిదిద్దుకోవాలని చెప్పారు. లేదంటే.. ప్రజలలో పార్టీ విశ్వసనీయత కోల్పోతుంది అని రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.