Sanchar Saathi App Controversy| దేశంలోని అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భారీ వివాదానికి తెరలేపింది. అయితే ఈ ప్రభుత్వం యాప్ ప్రజల ప్రైవెసీని దెబ్బతీస్తుందని, నిఘాను పెంచుతుందని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టత ఇచ్చారు.
మంగళవారం కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయంపై పార్లమెంటులో ప్రకటన చేశారు. “స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సంచార్ సాతీ యాప్ ఆప్షనల్. యాప్ కావాల్సిన వారు వినియోగించుకోవచ్చు.. వద్దంటే డెలీట్ చేయవచ్చు. ప్రతి ఒక్కరికీ ఈ యాప్ గురించి తెలియజేయడం మా బాధ్యత. దాన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా వినియోగదారుడి నిర్ణయం” అని ఆయన స్పష్టం చేశారు.
టెలికాం శాఖ (DoT) ప్రకారం.. సంచార్ సాథీ యాప్ ప్రధానంగా మూడు లక్ష్యాల కోసం తీసుకొచ్చారు:
అందుకే కొత్తగా తయారయ్యే లేదా దేశంలో దిగుమతి అయ్యే అన్ని మొబైల్స్లో ఈ యాప్ ప్రీ-ఇన్స్టాల్ చేయాలని, ఫోన్ మొదటిసారి ఆన్ చేసినప్పుడు స్పష్టంగా కనిపించేలా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా పంపాలని చెప్పారు. ఈ ఆదేశాలను 90 రోజుల్లో అమలు చేయాలని, 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపింది.
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. యాప్ తప్పనిసరి అనే ఆదేశాన్ని “నిఘా యాప్” అని మండిపడ్డారు. “ప్రజలకు గోప్యత హక్కు ఉంది. కుటుంబం, స్నేహితులకు మెసేజ్లు పంపినా ప్రభుత్వం చూడడం ఏమిటి? ఇది దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టే ప్రయత్నం” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రణ్దీప్ సూర్జేవాలా “ఇప్పుడు భారత్ ‘నిఘా రాష్ట్రం’ అయిపోయింది” అని విమర్శించారు. ఈ యాప్ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం సంచార్ సాథీ యాప్ ప్రీఇన్స్టాల్ చేయాలని అన్ని స్మార్ట్ఫోన్ కంపెనీలకు సూచించింది. అయితే ఐఫోన్స్ తయారు చేసే టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ కేంద్ర ఆదేశాలను తిరస్కరించింది. ఐఫోన్లలో ఈ యాప్ పెట్టడం వల్ల iOS ప్రైవెసీ, భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని ఆపిల్ అభిప్రాయపడింది. ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలియజేస్తామని, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో సవాల్ చేయడమో లేదా బహిరంగంగా వ్యతిరేకించడం లాంటి చర్యలు ప్రస్తుతానికి అవసరం లేదని ఆపిల్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు శామ్సంగ్, ఇతర స్మార్ట్ఫోన్ కంపెనీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్లైన్ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన