Special Intensive Revision: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సవరణలో భాగంగా పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఎన్నికల సంఘం తాజాగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. ఈ జాబితాల ప్రకారం, తమిళనాడులోనే సుమారు 97.37 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. అదేవిధంగా, గుజరాత్ రాష్ట్రంలోనూ దాదాపు 73 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించారు.
ఈ ఓట్ల తొలగింపు మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు గుర్తించే ప్రక్రియలో భాగంగా జరిగింది. ఒకే వ్యక్తి పేరు ఒక కంటే ఎక్కువ చోట్ల నమోదు కావడం, చిరునామా మార్పులు నమోదు కాకపోవడం, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో కొనసాగడం వంటి అంశాలను సరిదిద్దేందుకే.. ఈ సమగ్ర సవరణ చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అయితే, ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో అధికార డీఎంకే పార్టీతో పాటు పలు విపక్ష పార్టీలు ఈ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తున్నాయి. సీఎం ఎం.కే. స్టాలిన్ నియోజకవర్గంలోనే లక్షకు పైగా ఓట్లు జాబితా నుంచి తొలగిపోయినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో.. ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
మరోవైపు, ఎన్నికల సంఘం మాత్రం ఈ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేస్తోంది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నామని, అర్హులైన ఓటర్లు తమ పేరు తొలగించబడితే సంబంధిత బూత్ లెవల్ అధికారులను కానీ, ఈసీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తోంది. తుది జాబితా విడుదలకు ముందు అన్ని అభ్యంతరాలను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు.
Also Read: మింగుడు పడని గుడ్డు.. బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.10? ధరలు పెరగడానికి కారణాలివే!
గుజరాత్లోనూ ఓట్ల తొలగింపుపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. లక్షల సంఖ్యలో ఓట్లు ఒకేసారి తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ చర్యలు రాజకీయంగా ఏ విధంగా ప్రభావం చూపుతాయన్న అంశంపై విశ్లేషణలు మొదలయ్యాయి.